September 10, 2013

తెలుగు వారి ఆత్మగౌరవానికి పత్రీక ఎన్టీఆర్

విజయవాడ, సెప్టెంబర్ 10 : తెలుగు వారి ఆత్మగౌరవానికి పత్రీక ఎన్టీఆర్ అని, వైఎస్ విగ్రహాలు చూస్తే లక్ష కోట్లు గుర్తుకువస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం ఉదయం కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ దోచుకున్న లక్ష కోట్లలో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలేదని మండిపడ్డారు. దోపిడీదారులు, దొంగనోట్లు ముద్రించేవారు, రౌడీలు వైసీపీలో ఉన్నారని ఆరోపించారు.

మొదట తెలంగాణ, ఇప్పుడు సమైక్యం, ఆ తర్వాత విలీనం ఇదే వైసీపీ విధానమని ఎద్దేవా చేశారు. బెయిల్, కేసు మాఫీకి అంగీకారం కుదిరిందన్నారు. పీఆర్పీ కూడా కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని అప్పుడే చెప్పానని, ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే అని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కొత్త సమస్యను సృష్టించిన ఘనత కాంగ్రెస్‌దే అని బాబు తెలిపారు.

తెలంగాణ ఇచ్చింది తామే అని అక్కడి నేతలు అంటున్నారు....టీడీపీ వల్లే ఇక్కడి నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అంశంపై రాజకీయ పార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల వర్గాల ప్రజలకు ఒప్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.