August 7, 2013

కాలయాపన కమిటీలు కేవలం మోసం చేయడానికే: పయ్యావుల


ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయించేసి ఇప్పుడు కమిటీలతో మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతున్నదని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కమిటీ వేశారు కాబట్టి రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయిందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు, కాని విభజన నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఇక వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చెబుతోంది అని ఈ రెండు ప్రకటనల మధ్య గల వైరుధ్యాన్ని పయ్యావుల వివరించారు.
రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం అత్యంత బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితులలో మంత్రులు వెంటనే పదవులను త్యజించాలని, ఇంకా పదవులు పట్టుకుని వేలాడితే చరిత్రలో, వారి పేర్లు ద్రోహులుగా మిగిలిపోతాయని ఆయన విజ్ఞప్తి చేశారు.