August 30, 2013

యూ టర్న్ కాదు..టీ టర్న్ కాదు.. నా దారి ప్రజల దారి




 
"టీఆర్ఎస్ పార్టీ నాది యు- టర్న్ అంటుంది. వైసీపీ నాది టీ-టర్న్ అంటుంది. నాది ఆ టర్నూ కాదు...ఈ టర్నూ కాదు. స్ట్రెయిట్ లైన్. పబ్లిక్ లైన్. ప్రజలకు న్యాయం జరగాలి. తెలుగువారికి ఎక్కడ సమస్యలు వచ్చినా నేను అక్కడ ఉంటాను. ఉత్తరాఖండ్‌లో తెలుగువారు చిక్కుకుపోతే నేను వెళ్లాను. బాబ్లీకి వెళ్లాను. తెలుగు వారి గౌ రవం పెంచడానికి ప్రపంచమంతా తిరిగాను. సీమాంధ్రకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. కాంగ్రెస్ దాన్ని పట్టించుకోవట్లేదు. ముప్పై రోజులుగా ప్రజ లు రోడ్లపై ఉంటే ఎందుకు ఉన్నారని కూడా అడగకపోవడం మరీ ఘోరం. దీన్ని ప్రశ్నించడానికే నేను వెళ్తున్నాను'' అని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం నుంచి గుంటూరు జిల్లాలో తలపెట్టిన తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ తన నివాసంలో "ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని, ఎలాంటి రాష్ట్రం ఎలా అయిపోయిందన్న ఆవేదన మనసును పట్టి పీడిస్తోంది'' అన్నారు.

కేవలం తన రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్లజ్జగా వ్యవహరించిన తీరే రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ సంక్షోభంలోకి నెట్టిందని, నిర్ణయానికి ముందే అందరినీ విశ్వాసంలోకి తీసుకొని ఎవరి సమస్యలు ఏమిటో తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. "విభజన నిర్ణయం గురించి ప్రకటించిన నోటితోనే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడింది. దానిని టీఆర్ఎస్ «ద్రువీకరించింది. ఇది రాజకీయమా? ప్రజా కోణమా? టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కూర్చుని.. ఉద్యోగులు వెళ్లిపోవాలని, నాలుకలు కోస్తామని ప్రకటనలు చేశారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నాయకులు చెప్పగానే మాటమార్చి సంయమనం పాటించాలని హితోక్తులు చెబుతున్నారు. కాంగ్రెస్ స్క్రిప్ట్.. టీఆర్ఎస్ డైలాగులు. తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన నేను అడిగితే ప్రధాని సమయం ఇవ్వరు. విజయమ్మ అడగ్గానే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. వైఎస్ ఉంటే ఇలా జరిగేది కాదని సానుభూతి చూపిస్తారు. రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ కేసు మోపడంతో జైలులో ఉన్న వ్యక్తి గురించి రాష్ట్రపతి వాకబు చేస్తారు.

వీరి మధ్య బంధం ఎంత బలీయంగా ఉందో ఇదే ఉదాహరణ. ఇటు టీఆర్ఎస్‌ను, అటు వైసీపీని కలుపుకొని కాంగ్రెస్ రాజకీయ కుట్రలు చేస్తోంది. ఈ పార్టీల మద్దతుపై ధైర్యంతో ప్రజలను చిన్నచూపు చూస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది'' అని బాబు ధ్వజమెత్తారు. తన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటున్న ప్రత్యర్థి పార్టీల విమర్శలను చంద్రబాబు తోసిపుచ్చారు. "అమ్మ దయ.. అమ్మ వరం అంటూ హైదరాబాద్‌లో టి-కాంగ్రెస్ నేతలు సోనియా ఫొటోతో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టారు. నా వల్లే వచ్చి ఉంటే వాటిపై కనీసం నా పేరైనా వేసి ఉండాలి కదా. ఎక్కడా కనిపించట్లేదే'' అని వ్యాఖ్యానించారు. తెల్ల కాగితంపై సంతకం చేసి ఇచ్చిన మాదిరిగా కేంద్రానికి లేఖ ఇచ్చిన వైసీపీకి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. "రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి సర్వాధికారాలు ఉన్నాయని షిండేకు ఇచ్చిన లేఖలో వైసీపీ రాసింది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకొన్నా కట్టుబడి ఉంటామని చెప్పింది.

ఇక మీరు టీడీపీని ఎలా అంటారు? మమ్మల్ని ఓడించలేమన్న భయంతో 1999లో తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది వైఎస్. 2004లో తెలంగాణ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టారు. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొన్నారు. మంత్రి పదవులు ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి మాపై రాళ్లు వేస్తున్నారు. వీళ్లను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రెండు వైపులా ఓట్లూ సీట్లూ వస్తాయని కలలు కంటోంది'' అని ఆయన విమర్శించారు. తొమ్మిదేళ్లు గాడిద చాకిరీ చేసి ఒక స్థాయికి తెచ్చిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ తన అసమర్థ, అస్తవ్యస్త నిర్ణయాలతో నాశనం చేసి వదిలిపెట్టిందని బాబు దుయ్యబట్టారు. "మూడేళ్లు తెలంగాణలో ఉద్యమాలు, అనిశ్చితి. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమ జ్వాలలు. ఎలాంటి రాష్ట్రం ఎలా అయిందన్న బాధ కలుగుతోంది. ఎంతో కష్టపడి హైదరాబాద్‌ను ఈ స్థాయికి తెచ్చాం. దేశం అంతా మనవైపు చూసేలా చేశాం.

సమస్యలు మాకూ వచ్చాయి. ఆలమట్టి విషయంలో ప్రధానిగా ఉన్న దేవెగౌడతో తగాదా వస్తే.. ఐదుగురు సీఎంలతో కమిటీ వేయించి పరిష్కరించాం. ఇప్పుడు నేను కేవలం ప్రతిపక్ష నేతను. నా పాత్ర పరిమితం. సలహాలు ఇవ్వగలను. లేఖలు రాయగలను. పెద్దన్న పాత్రలో కాంగ్రెస్ ఉంది. కానీ ఆ పార్టీ తన బాధ్యతను విస్మరించింది. ప్రజల్లోకి వెళ్లి అదే చెబుతాను'' అని ఆయన వివరించారు. తాను మాట మారుస్తున్నానన్న టి-జేఏసీ చైర్మన్ కోదండరాం విమర ్శను బాబు తోసిపుచ్చారు. "ఆయన ఒక్క రోజు కూడా నన్ను అభినందించలేదు. మా గురించి ఇన్ని రోజులూ ఒక్క మంచి మాట చెప్పలేదు. ఇప్పుడు మాత్రం నేను మాట మార్చానంటున్నారు.

జేఏసీ నుంచి పనిగట్టుకొని మా పార్టీ వారిని వెళ్లగొట్టారు. నా పాదయాత్రకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. వీళ్లందరూ కాంగ్రెస్ గూటి పక్షులు. టీడీపీని దెబ్బ తీయాలన్నది వీరి ఉమ్మడి లక్ష్యం'' అని మండిపడ్డారు. అటూ ఇటూ రెండు వైపులా తన యాత్రను అడ్డుకోవడానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. హరికృష్ణ యాత్ర గురించి ప్రశ్నించగా.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తాను వారి వెంట ఉంటున్నానని, మిగిలిన వారి గురించి తాను పట్టించుకోనని జవాబిచ్చారు.
రేపటి నుంచి చంద్రబాబు యాత్ర

'తెలుగువారి ఆత్మ గౌరవ యాత్ర' పేరుతో చంద్రబాబు తలపెట్టిన బస్సు యాత్ర ఆదివారం గుంటూరు జిల్లా నుంచి ప్రారంభం కానుంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బాబు నిర్వహిస్తున్న యాత్రల్లో ఇది మూడోది. 2008లో ఆయన 'మీ కోసం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించారు. కొంతకాలం క్రితం ఏకబిగిన ఏడు నెలలపాటు పాదయాత్ర జరిపారు. రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లే నిమిత్తం ఆయన తాజా యాత్ర తలపెట్టారు. టీడీపీ విడుదల చేసిన కార్యక్రమం ప్రకారం గుంటూరు జిల్లా సరిహద్దులోని పొందుగుల గ్రామం నుంచి ఆయన పర్యటన మొదలవుతుంది. అక్కడ నుంచి శ్రీనగర్, గామాలపాడు, నడికుడి మీదుగా గురజాల చేరతారు. అక్కడ నుంచి దాచేపల్లిలో ఆయన యాత్ర ముగుస్తుంది. రెండో తేదీన దాచేపల్లిలో మొదలై వీరాపురం మీదుగా కొండమోదు, నెమలిపురి, నకిరికల్లు చేరుతుంది.