August 23, 2013

పల్లె రఘునాథ రెడ్ది దీక్ష భగ్నం... నిరసనగా ఆయన సతీమణి ఉమ దీక్ష!

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని డిమాండ్ చేస్తూ.. పుట్టపర్తి తెదేపా ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పల్లె గత అయిదు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. రఘునాథ రెడ్డి దీక్ష భగ్నంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే, సమైక్యాంధ్ర కోసం చేస్తున్న దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా ఆయన సతీమణి ఉమ దీక్షకు దిగారు. ఉమ దీక్షకు భారీ ఎత్తున తెదేపా కార్యకర్తలు, సమైక్యవాదులు మద్దతు పలికారు. కాగా, ఎమ్మెల్యే ఆరోగ్యం క్షీణిస్తుండటం వల్లే దీక్షను భగ్నం చేశామని పోలీసులు చెబుతున్నారు. రఘునాథ రెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు.