August 25, 2013

ప్రభుత్వ కమిటీ వేయడానికి సోనియా ఎవరు? : నన్నపనేని


రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రభుత్వ కమిటీ వేస్తామని సోనియాగాంధీ పేర్కొనడంపై ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ హోదాలో కమిటీ వేస్తామని ఆమె చెబుతున్నారని ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం గుంటూరులో నన్నపనేని విలేకరులతో మాట్లాడుతూ కమిటీ ప్రకటన ద్వారా సోనియా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను అవమానపరిచారన్నారు. సోనియా కేవలం ఒక లోక్‌సభ సభ్యురాలన్న విషయం మరిచిపోవద్దన్నారు.

సోనియా, ఆమె తొట్టి గ్యాంగ్‌పై తమకు నమ్మకం లేదని, ఆ కమిటీని ఆమోదించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పదేపదే సోనియా చెబుతూ సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నా కేంద్ర మంత్రులు ఇంకా ఏ ముఖం పెట్టుకొని పదవులు పట్టుకొని వేలాడుతున్నారని ప్రశ్నించారు. పదవులు పట్టుకొని వేలాడే కన్నా ఎందులోనైనా దూకి చావడం మంచిదని సీమాంధ్ర కేంద్ర మంత్రులపై నన్నపనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.