August 25, 2013

విభజన కాంగ్రెస్‌కు భస్మాసుర హస్తం : మురళీ మోహన్


రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీకి భస్మాసుర హస్తం కానుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాగంటి మురళీ మోహన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న దీక్షలకు సంఘీభావం తెలిపారు. కొడుకును ప్రధానిని చేయాలన్న రాజకీయ స్వార్థంతోనే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకున్నారని తూర్పారబట్టారు.

విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయాలకు అతీతమైన ప్రజాఉద్యమం ఉద్భవించిందని అన్నారు. దాంతో పునరాలోచనలో పడ్డ ఢిల్లీ పెద్దలు ఏంచేయాలనే విషయమై తర్జనభర్జనలు పడుతున్నారన్నారు. సమైక్య ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే రెండో స్థానానికి చేర్చిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు.