July 25, 2013

బోల్తాపడిన కాంగ్రెస్‌



- పంచాయతీలో ఫలించని సిఎం కిరణ్‌ వ్యూహం!
- 'సైకిల్‌' దూకుడు
రాష్ట్రంలో తొలి విడత పంచాయతి ఎన్నికల్లో అధికార పార్టీ బోల్తా పడినట్లుగా స్పష్టమైంది. మంగళవారం అర్ధరాత్రి వరకూ అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి 1890 సర్పంచ్‌ స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీకి 1670, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 1260, తెలంగాణ రాష్ట్ర సమితికి 453 సర్పంచ్‌ పదవులు లభించాయి.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పంచాయతి ఎన్నికలకు వేసిన వ్యూహం బెడిసికొట్టింది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌ పదవుల్లో అధికార పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయని సంబరపడినప్పటికీ, ప్రజా క్షేత్రంలో మాత్రం అందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓటింగ్‌ పద్ధతిలో జరిగిన పంచాయతి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన స్థానాల కంటే అత్యధికంగా రావడంతో పార్టీ వర్గాలు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి.