July 10, 2013

దొంగలకు అడ్డా వైఎస్సార్ కాంగ్రెస్ : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలోని దొంగలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హంతకులు, దోపిడీదారులు, నకిలీ నోట్ల ముఠాకు ఓ పార్టీ ఉందని వైసీపీ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.

స్నేహితుడిని చంపి వైసీపీ కోసం ఖర్చు పెట్టే స్థాయికి కొందరు దిగజారడం దారుణమన్నారు. జైలు నుంచే జగన్ ఇలాంటి ముఠాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జగన్ ముఠా చేసే అక్రమాలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. జగన్, కిరణ్‌కుమార్‌రెడ్డి అవిభక్త కవలలుగా అక్రమాలకు సహకరించుకుంటున్నారని భావించారు.

రాజమండ్రి దోపిడీ కేసును తొక్కిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని రేవంత్ అన్నారు. పోలీసుల విచారణ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి వెల్లడించిన వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు షర్మిల పాదయాత్ర ఉందని విమర్శించారు. షర్మిల పాదయాత్రకు ఏర్పాట్లు చేసే వారిపై పోలీసులు నిఘా పెట్టాలని ఆయన కోరారు.