June 3, 2013

కేసీఆర్ పొలిటికల్ బ్రోకర్


హైదరాబాద్, జూన్ 3 : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వల్ల తెలంగాణ రాదని, ఆయన ఓ పొలిటికల్ బ్రోకరని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉండి తెలంగాణ సాధించని నేతలు తోక పార్టీలో చేరి ఎలా సాధిస్తారని టీఆర్‌ఎస్‌లో చేరిన టీ. కాంగ్రెస్ ఎంపీల నుద్దేశించి మోత్కుపల్లి ప్రశ్నించారు.

కేసీఆర్ తెలంగాణ కాపలా కుక్క కాదని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి కాపలా కుక్క అని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేత కడియం శ్రీహరి తనపై కోర్టుకు వెళ్తే అక్కడే అతను దళితుడు కాదని చెబుతానని అన్నారు. తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, కెటి రామారావులు కెసిఆర్ దుష్ప్రభావానికి లోనుకాకుండా టిడిపిలో చేరాలని సూచించారు.

తెలంగాణ వస్తే దళితుడిని మఖ్యమంత్రి చేస్తానని చెబుతున్న కెసిఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు దళితుడిని చేస్తారా అని మోత్కుపల్లి సవాల్ చేశారు. ద్రోహులు, సన్నాసులు అన్న వారినే అతను తెరాసలోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ పన్నెండేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. కెసిఆర్‌కు తెలంగాణ కావాలా లేక రాజకీ పార్టీ కావాలా అని ప్రశ్నించారు. ఓట్లు, నోట్లు, సీట్ల కోసమే కెసిఆర్ తాపత్రయపడుతున్నారన్నారు.కెసిఆర్‌కు దమ్ముంటే మళ్లీ మహబూబ్ నగర్ నుండే పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు.