June 22, 2013

కడియం దళిత ద్రోహి: దొమ్మాటి సాంబయ్య

పదవి వ్యామోహంతో తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిసిన కడియం శ్రీహరి దళిత ద్రోహి అని తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దొమ్మాటి సాంబయ్య ధ్వజమెత్తారు. శనివారం హన్మకొండలోని ఆయన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాంబయ్య మాట్లాడారు. తాను దొంగ బిపామ్‌తో పోటీ చేశానని కడియం శ్రీహరి వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

చంద్రబాబు స్వయంగా జారీ చేసిన బిఫామ్‌తోనే పోటీ చేశానని వివరణ ఇచ్చారు. తనకు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కడియం అవకాశాలు కల్పించాడని ప్రకటనలు చేయడం అవాస్తవమని పార్టీలో ఏ ఒక్క దళితుడిని ఆయన ఎదుగనివ్వలేదని ఆరోపించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు దళితుల్లో ఉపకులమైన బైండ్ల కులస్తుడైన కడియంకు పలు అవకాశాలు కల్పిస్తే అధినేత నమ్మకాన్ని వమ్ముచేస్తూ పార్టీని వీడటమేకాకుండా అదే పార్టీపై విమర్శలు చేయడం క్షమించరాని విషయమని దుయ్యబట్టారు. జిల్లా టీడీపీలో ఏ ఒక్క దళితుడికి అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడని తనకు 1998 ఎన్నికల్లో పరకాల టికెట్ రాకపోవడానికి కడియమే కారణమని ఆరోపించారు.