May 29, 2013

జైల్లో అన్ని జరిగిపోతున్నాయి వైసీపీపై చంద్రబాబు ధ్వజం వసూళ్లకు పాల్పడుతున్న సీఎం : బాబు


   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జైల్లోనే అన్ని జరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెసు నేత విశ్వం  బుధవారం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు బెయిల్ రాకపోవడంతో ఆందోళనలు చేపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు.  జగన్ పార్టీ నిరసనలు చేపట్టడం సిగ్గు చేటు అన్నారు. దొంగలందరు సంఘంగా ఏర్పడి ఇలాగే ధర్నాలు చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. హంతకులు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఇలాగే ధర్నాలు చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఆందోళన చేసిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బెయిల్ ఇవ్వని కోర్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశారా అన్నారు.  తెలుగుదేశం పార్టీకి పత్రికలు, టీవి ఛానళ్లు లేవని, కార్యకర్తలే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని  ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన తెలియని వ్యక్తి అన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి తమ్ముళ్లు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారని, వాళ్లు ఫైళ్లు తీసుకు వస్తే కిరణ్ సంతకాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని కోరారు.  వైయస్ హయాంలో వ్యవస్థలు నాశనమయ్యాయన్నారు.