March 12, 2013

టీడీపీలో చేరనున్న గుబ్బల తమ్మయ్య

ఏలూరు: ఆచంట నియోజకవర్గంలో ఆచంటకు చెందిన సీనియర్ నేత గుబ్బల తమ్మయ్య టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన బుధవారం కవిటంలో టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. ఇంతకు ముందు ఆయన ఆచంటలో కాంగ్రెస్ జడ్పీటీసీగా వ్యవహరించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి పీఆర్పీలో చేరారు. విద్యావంతుడు, బీసీ తరగతులకు చెందివాడై ఉండటంతో ఆయన్ను 2009 లోక్ సభ ఎన్నికల్లో పీఆర్పీ నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత తమ్మయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉండిపోయారు. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆయన్ని టీడీపీలో చేర్చుకోవాలని తాజాగా టీడీపీ వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చాయి.