January 20, 2013

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీదే విజయం

రాబోయే 2014అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఆదివారం సూర్యాపేటలో మునిసిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు జనప్రభంజనం కనిపించిందన్నారు. అడుగడుగునా ప్రజల ఆశీర్వాదాలు, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో జిల్లాలో 12అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పటేల్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరివేయాలని అన్నారు. సీఎంనుంచి ఆదర్శరైతుల వరకు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మోత్కుపల్లి ఆధ్వర్యంలో పాలేరు జలాల కోసం పాదయాత్ర చేస్తే ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. అవినీతి కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించడానికి ప్రజలు సంసిద్దమయ్యారన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బడుగుల లింగయ్యయాదవ్, మునిసిపల్ మాజీచైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, డాక్టర్లు రాంమూర్తియాదవ్, రాం చందర్‌నాయక్, టీడీపీ నాయకులు నెమ్మాది బిక్షం, దారోజు జానకిరాములు, వెంకటేశ్వర్‌రావు, మన్మథరెడ్డి, సుధాకర్‌యాదవ్, శ్రీరాములు, రాజా, నర్సయ్యయాదవ్, మోహినోద్దీన్, రమేష్, బాలాజీనాయక్ పాల్గొన్నారు.