January 20, 2013

బాబు పాదయాత్రకు విశేష స్పందన :టీడీపీ రాష్ట్ర నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డి

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్రకు తెలంగాణ ప్రాంతంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారని టీడీపీ రాష్ట్ర నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ నియోజకవర్గం నుంచి కోదాడలో చంద్రబాబు పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ 2014ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తమ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు.

జిల్లాలో చంద్రబాబు పాదయాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుండటం చూసి ఇతర పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో మెజారిటీ స్థానాలను సాధిస్తామన్నారు. చంద్రబాబు పాదయాత్రకు నల్లగొండ నియోజకవర్గం నుంచి బస్సులు, డీసీఎంలు, సుమోలు, పలు వాహనాల్లో కార్యకర్తలు తరలివెళ్లారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయపల్లి కృష్ణారెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బొర్రా సుధాకర్, కంచనపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు.