December 18, 2012
ఓటేసి దీవించండి.. మీకు తోడుంటా..
జగిత్యాల/రాయికల్ : మీరు చూపించిన
అభిమానం మరిచిపోలేను. ఈ గ్రామంలో ఇంత పెద్ద మనస్సుతో నన్ను చూడటానికి
వచ్చారు. ఓటేసి దీవించండి. మీకు తోడుగా నేనుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు
నాయుడు అన్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా సోమవారం రాయికల్ మండలం
ఇటిక్యాల శివారు నుంచి రాయికల్, కుమ్మరిపెల్లి, ఉప్పుమడుగు, అల్లీపూర్,
కిష్టంపేట వరకు 14.7 కి.మీ. పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా రాయికల్ మండల
కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ
అధికారంలోకి వస్తే రాయికల్ మండల ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
రాయికల్లో డిగ్రీ కళాశాల కోసం కృషి చేస్తానని, మినీ స్టేడియం
నిర్మిస్తామని అన్నారు. చెన్నకేశవ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ
ఇచ్చారు. బోర్నపెల్లి వద్ద వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి
తెస్తామన్నారు. బస్ షెల్టర్లో షెడ్డుల నిర్మాణానికి కృషి చేస్తామని,
శివారు ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తామన్నారు.
బైపాస్ రోడ్లో మురికి కాలువల కోసం ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.
ఇందిరమ్మ కాలనీలో వర్షపు నీరు రాకుండా మురికి కాలువల నిర్మాణానికి మా
ప్రభుత్వం వస్తే కృషి చేస్తామన్నారు.
కళాశాల సమస్యలు తీరుస్తా..: వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బస చేశారు. ఈ సందర్భంగా ఉదయం కళాశాల విద్యార్థులతో ఆయన మాట్లాడారు. తమ హాయాంలోనే కళాశాలలు, పాఠశాలలు నిర్మించామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందే తప్ప విద్యాభివృద్ధికి కృషి చేయడం లేదన్నారు.
తాము గతంలో 24 డీఎస్సీలు పెట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఫ్లోరైడ్ నీటితో ఇబ్బందులు పడుతున్నారని, నీటి వసతి కల్పించాలని, విద్యుత్ సౌకర్యం లేకపోవటంతో ఇబ్బందిగా ఉందని విద్యార్థులు చంద్రబాబుకు విన్నవించారు. దీంతో స్పందించిన చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటూనే తాము అధికారంలోకి వస్తే కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
Posted by
arjun
at
12:52 AM