November 20, 2012

ఢిల్లీ స్థాయిలో గిరిజన గళం వినిపిస్తా, ఆదివాసీ నేతగా నిరూపించుకుంటా

నా పేరు చంద్రబాబు నాయక్
ఢిల్లీ స్థాయిలో గిరిజన గళం వినిపిస్తా
ఆదివాసీ నేతగా నిరూపించుకుంటా
తండాలకు పంచాయతీ హోదా కల్పిస్తా
పీజీ దాకా ఉచిత విద్య అందిస్తా
ఆడపిల్లల పెళ్లికి రూ.50 వేలు
లంబాడాలకు చంద్రబాబు హామీ
50 రోజులు పూర్తయిన పాదయాత్ర
మెదక్‌జిల్లా చింతలపల్లి వద్ద కేక్ కట్ చేసిన టీడీపీ అధినేత

సంగారెడ్డి, నవంబర్ 20 : " గిరిజనులను అన్ని రకాలుగా ఆదుకుని, వారికి అండగా ఉండి, చంద్రబాబు నాయక్‌గా పేరు తెచ్చుకుంటా''నని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఘనత చిరంజీవిదేనని దుయ్యబట్టారు. "అందరూ కలిసి వస్తే కాంగ్రెస్‌ను తరిమికొడదా''మని పిలుపునిచ్చారు. పశువుల కన్నా హీనంగా ఎమ్మెల్యేలను రూ.20 కోట్లకు కొనడమే విశ్వసనీయతా అని జగన్ పార్టీ నేతలను ఘాటుగా ప్రశ్నించారు. మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని చింతలపల్లి ఈద్గా నుంచి మద్దికుంట చౌరస్తా వరకు మంగళవారం పాదయాత్ర నిర్వహించారు.

యాత్ర ప్రారంభించి 50 రోజులైన సందర్భంగా కేక్ కట్ చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుక్యా సంజీవనాయక్, విద్యార్థి నేత శంకర్ నాయక్ చంద్రబాబుకు 25 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు బంజారాలకు ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. "500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా చేస్తాను. గిరిజన పిల్లలను కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తాను.ఇంటిజాగా ఇచ్చి, రూ.1.5 లక్షలతో ఇల్లు కట్టిస్తాను. తండాల్లోని ఆడపిల్లల పెళ్లికి యాభై వేల రూపాయలు ఇస్తాను'' అంటూ వారిని ఉత్సాహపరిచారు.

దళితుల బాగు కోసం పోరాడుతున్న ఎంఆర్‌పీఎస్ నేత మందకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. "కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు 63 ఏళ్ల వయసులో మీ వద్దకు పాదయాత్రగా వచ్చాన''ని చెబుతున్నప్పుడు జనంలో విశేష స్పందన కనిపించింది. ప్రజలను చైతన్య పరిచి ప్రజాఉద్యమం నిర్మించేందుకు పవిత్రమైన మనసుతో వచ్చానని చంద్రబాబు అనగా హర్షాతిరేకాలతో స్వాగతించారు. "పది అడుగులు నాతో కలిసి రండి. సహకరించాల''ని కోరగా.. అక్కడ ఉన్నవారంతా ఉత్సాహంగా ముందుకొచ్చారు.

"మీరు ఇలాగే ఉత్సాహం చూసిస్తే మీ రుణం తీర్చుకుంటాను. మనకు కష్టాలు పోయి మంచి రోజులు వస్తాయి. అధికారంలోకి తప్పకుండా వస్తాం. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత మేర మీ బాగుకోసమే పని చేస్తా''నని భావోద్వేగంగా పలికారు. అదే సమయంలో కేంద్ర మంత్రి చిరంజీవిపై నిప్పులు చెరిగారు. "సినిమా నటుడు చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాలను భ్రష్టు పట్టించారు. సామాజిక న్యాయమంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రజల సంగతిని పక్కనపెట్టి తనకు న్యాయం జరిగేలా చూసుకున్నారు. మంత్రి పదవి కోసం పార్టీనే విలీనం చేశారు'' అని ఘాటుగా విమర్శించారు.

తమ అధినేత్రి సోనియా చెప్పినా సీఎం కిరణ్ వినే పరిస్థితి కనిపించడం లేదని , కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏడాదికి తొమ్మిది సిలిండర్లు ఇవ్వాలని ఆమె ఆదేశించినా సీఎం పట్టించుకోలేదని గుర్తు చేశారు. "ముఖ్యమంత్రి కిరికిరిరెడ్డి (కిరణ్‌కుమార్‌రెడ్డి), మాఫియా డాన్ బొత్స సత్యనారాయణలను మార్చే స్థితిలో సోనియాగాంధీ లేర''న్నారు. వారిద్దరూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి కుటుంబానికి పది సిలిండర్లు చొప్పున ఇస్తామని పునరుద్ఘాటించారు.తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.
No comments :

No comments :