September 21, 2013
నేడు రాష్ట్రపతితో బాబు భేటీ
రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ ఎంపీలు కాకుండా సీమాంధ్ర ప్రాంతం నుంచి ఆరుగురు, తెలంగాణ ప్రాంతం నుంచి ఆరుగురు నేతలు ఆయన వెంట ఈ యాత్రలో పాల్గొంటున్నారు. సీమాంధ్ర నుంచి కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, కోడెల శివ ప్రసాదరావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, అయ్యన్న పాత్రుడు, పయ్యావుల కేశవ్, తెలంగాణ నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎల్. రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, మహేందర్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకోనున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ మాత్రమే కోరినట్లు తెలుగుదేశం కార్యాలయ వర్గాలు తెలిపాయి.
తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన రాష్ట్రపతికి వివరించనున్నట్లు తెలిసింది. శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఢిల్లీ చేరుకుంటున్న చంద్రబాబు బృందం సోమవారం ప్రధాని అధ్యక్షతన జరిగే జాతీయ సమగ్రతా మండలి సమావేశం తర్వాత తిరుగు ప్రయాణమవుతుంది. కాగా ఈ పర్యటనలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, సీపీఐ, సీపీఎం, జనతాదళ్(ఎస్), బీజేడీ, అకాలీదళ్, ఐఎన్ఎల్డీ, ఆర్ఎల్డీ, ఎస్పీ తదితర పార్టీల నేతలను కూడా కలిసి తెలంగాణ అంశం, ఇతర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిసింది.
Posted by
arjun
at
12:07 AM