August 28, 2013

ప్రధాని మన్మోహన్ ఓ మైనపు బొమ్మ : మోదుగుల

ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఓ మైనపు బొమ్మని, సోనియాగాంధీ చేతిలో కీలు బొమ్మని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలతో దివంగత మాజీ సీఎం వైఎస్ ఆడుకుంటే, కేంద్రం రాష్ట్రంతో ఆడుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. అసలు రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలా? లేక కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? అనేది తెలియడం లేదని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనపై కేంద్రం ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంది. మరి ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలగా ఎందుకు విభజించలేదని మోదుగుల ప్రశ్నించారు. మొదటి నుంచి ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీయే పోరాటం చేస్తోందని, అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో మోదుగులతోపాటు ఎంపీలు సీఎం రమేష్, నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు.