August 28, 2013

చంచల్‌గూడ జైలు వైసీపీ ఆఫీస్‌లా మారింది : సోమిరెడ్డి

సీమాంధ్రలో ఇంత పెడ్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని టీడీపీ సీనిరయర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. సీమాంధ్ర కు న్యాయం జరగాలని కోరుతూ టీడీపీ ఎంపీలు చేపట్టిన దీక్షను ఒక్కరోజులోనే భగ్నం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జైల్లో జగన్మోహన్‌రెడ్డి దీక్ష చేస్తుంటే హెల్త్ బులెటిన్‌లు విడుదల చేస్తున్నారని, చంచల్‌గూడ జైలు వైసీపీ ఆఫీసులా మారిందని ఆయన దుయ్యబట్టారు.

పొత్తుల కోసం కాంగ్రెస్ వెంపర్లాడుతోందని, జైలు నిబంధనలు సడలించి వైసీపీకి రెండు గదులు కేటాయించిందని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మకు ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇస్తే ఇక జగన్‌పై విచారణ నిష్పాక్షికంగా ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నిర్ణయంలో ఏ-1 దివంగత వైఎస్ అయితే, ఏ-2 కాంగ్రెస్ అని సోమిరెడ్డి పేర్కొన్నారు. తెలుగు జాతిని నాశనం చేయడమే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆఖరి కోరికలా కనిపిస్తోందని సోమిరెడ్డి అన్నారు. జైళ్ల చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, జగన్‌కు వేరాలా ఉండకూడాదని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, వైసీపీలను కలుపుకునేందుకు సోనియా ఆరాటపడుతున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.