July 26, 2013

అవనిగడ్డ ఏకగ్రీవానికి సహకరించండి...రాష్ట్రపార్టీలకు చంద్రబాబు లేఖ

కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరగనున్న ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి అంబటి హరిప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయేందుకు సహకరించాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు విపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సాధారణంగా సిట్టింగ్‌ శాసనసభ్యులు ఆకస్మికంగా మృతి చెందిన సందర్భాల్లో మృతుని కుటుంబ సభ్యులను ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించే ఆనవాయితీ రాష్ట్రంలో ఉందన్న విషయం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమ దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడైన హరిప్రసాద్‌ను తమ పార్టీ తరపున అభ్యర్థిగా నిలుపుతున్న క్రమంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని చంద్రబాబు కోరారు. ఆయన పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మీ, సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ కార్యదర్శి కె. నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్‌ రెడ్డి, లోక్‌సత్తా అధ్యక్షులు కటారి శ్రీనివాస రావుకు వేర్వేరుగా లేఖలు రాశారు.