July 28, 2013

ఓటు అడిగే హక్కు టీడీపీకి మాత్రమే ఉంది

ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం టీడీపీకి మాత్రమే ఉందని తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దేముల్ మండలంలో టీడీపీ మద్దతుతో బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన జరిపారు. బుద్దారం, పెద్దేముల్‌తండా, మంబాపూర్, కొండాపూర్, ఒగులాపూర్, నాగులపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనదని అన్నారు. వారంతా జైలు పాలవుతారని తెలిపారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకే పట్టం కట్టారని తెలిపారు. జరగబోయే గ్రామాల్లో కూడా టీడీపీ అధిక సంఖ్యలో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామాలను అభివృద్ధి చేయలేక పోయిందని, జరిగిన అభివృద్ధి అంతా ఎమ్మెల్యేగా తాను చేసిందేనన్నారు. అందుకోసమే ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని పేర్కొన్నారు. టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాజీపూర్ నారాయణరెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు కొమ్ముగోపాల్‌రెడ్డి, శామ్‌రావు పంతులు, మోహన్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, చిన్న రాసన్న, ఎం.రాములు, రాంచందర్, పాండు, అశోక్, నర్సిములు పాల్గొన్నారు.