July 3, 2013

పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలి : చంద్రబాబు

విశాఖ : పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ తొలి ప్రాంతీయ సదస్సు బుధవారం విశాఖలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్నికలను సకాలంలో నిర్వహించలేదని విమర్శించారు. టీడీపీ హయాంలోనే పంచాయతీలను బలోపేతం చేశామని ఆయన చెప్పారు. తమ హయాంలో అర్హులకు పింఛన్లు అందితే, కాంగ్రెస్‌ హయంలో అనర్హులకు మంజూరు చేశారని ఆరోపించారు. సర్పంచ్‌ అధికారాలను, విధులను ఇతరులకు బదిలీ చేసి పంచాయతీ సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చిందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో సర్పంచ్‌లకు పూర్తి అధికారం ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం పేరుతో కాంగ్రెస్‌ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. విశాఖ , విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి పార్టీ నేతలు అధిక సంఖ్యలో సదస్సుకు హాజరయ్యారు.