May 6, 2013

మా నాయకుడి విగ్రహం పెడుతూ.. మమ్మల్నే పిలవరా?

టీడీపీ ఎంపీల ఆగ్రహం.. నేడు స్పీకర్‌తో భేటీ
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది : తుమ్మల

న్యూఢిల్లీ, ఖమ్మం :: "మా నాయకుడి విగ్రహం పెడుతూ మమ్మల్ని ఆహ్వానించరా?''..పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ విషయంలో టీడీపీ ఎంపీల ఆగ్రహం ఇది. ఇలా ఎందుకు జరిగిందో స్పీకర్‌నే అడుగుతామని ఆ పార్టీ ఎంపీ ఒకరు తెలిపారు. ఈమేరకు.. వారు సోమవారం ఉదయం 10:30 గంటలకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను ఆమె కార్యాలయంలో కలవనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంగళవారం పార్లమెంటులో ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా పార్లమెంటులో ఏ నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసినా స్పీకర్ కార్యాలయమే అధికారికంగా ఆ పార్టీ అధ్యక్షుడికి, పార్లమెంటు సభ్యులకు, కుటుంబసభ్యులకు ఆహ్వానాలు పంపిస్తుంది.

కానీ ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావాలంటూ తమ అధినేత చంద్రబాబునాయుడుకుగానీ, తమకుగానీ ఇంత వరకూ స్పీకర్ కార్యాలయం నుంచి ఆహ్వానాలు అందలేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా.. ఈ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించకుండా కాంగ్రెస్‌పార్టీ రాజకీయాలు చేస్తోందని ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. పార్లమెంటరీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో తుమ్మల మీడియాతో మాట్లాడారు. గతంలో ఎందరో మహానుభావుల విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు లేని గొడవలు ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ విషయంలో మాత్రం ఎందుకు సృష్టిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

మూడు విగ్రహాలూ ఆ కుటుంబం నుంచే..
తెలుగు వారైన టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాలు ఇప్పటికే పార్లమెంటులో ఉన్నాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే.. అది మూడో తెలుగు నాయకుడిది అవుతుంది. కాగా, ఈ మూడు విగ్రహాలనూ తయారు చేసింది ఒక కుటుంబానికి చెందిన వారే కావటం విశేషం. గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన శిల్పి దేవు శంకర్ తొలి రెండు విగ్రహాలనూ తయారు చేశారు. ఆయన కుమారులు మయాచార్య, నాగ మయా నారాయణాచార్య ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి తమకు ఈ అవకాశం కల్పించారని వారు చెప్పారు. విగ్రహ తయారీకి మూడు నెలల సమయం పట్టిందని, 900 కేజీల బరువు ఉందని చెప్పారు. తయారీ సమయంలో పార్లమెంటు విగ్రహాల కమిటీతో పాటు పురందేశ్వరి, జయకృష్ణ విగ్రహాన్ని పరిశీలించారని చెప్పారు.