February 24, 2013

అసమర్థ ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అసమర్థత వల్లే ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రను శనివారం 19వ రోజు భట్టిప్రోలు మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభించారు. పాదయాత్ర దుర్గా పిక్చర్ ప్యాలెస్ వద్దకు చేరుకున్న సమయలో పలువురు చేనేత కార్మికులు చంద్రబాబుకు వారి సమస్యలు విన్నవించారు. రోజంతా కష్టపడ్డా రూ. 100 ఆదాయం రావడం లేదని, కుటుంబాలు గడవక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

చేనేత సహకార సంఘాలు ఉన్నా వాటి వల్ల 20 శాతం మంది మాత్రమే లబ్ధిపొందుతున్నారని, మిగిలిన 80 శాతం మందికి ప్రభుత్వ సాయం అందడం లేదని కన్నీళ్లుపెట్టుకున్నారు. తమను ఆదుకోవాలని కోరారు. దీనికి స్పందించిన చంద్రబాబు ప్రతి పక్షంలో ఉన్నా చేనేత కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను చరఖా పట్టుకుని అసెంబ్లీకి వెళ్తే భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 312 కోట్ల నిధులు నేతన్నల కోసం కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొందన్నారు. ఇది జరిగి మూడేళ్లు గడిచినా వాటిలో మూడు రూపాయలు కూడా నేత కార్మికుల కోసం ఖర్చు చేయలేదన్నారు.

నేతన్నల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిన్న చూపుకు ఇది నిదర్శనమన్నారు. తాము అధికారంలోకి వస్తే నేత కార్మికుల కోసం రూ. లక్ష వడ్డీ లేని రుణాలు ఇస్తామని, ఏడాదికి వెయ్యి కోట్ల వంతున ఐదేళ్లలో ఐదు వేల కోట్లు నేత కార్మికుల సంక్షేమం కోసం వెచ్చిస్తానని, రూ.1.50 లక్షలు వెచ్చించి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే జనతా వ్రస్తాలు అందుబాటులోకి తెచ్చి నేత వృత్తిని ప్రోత్సహిస్తామన్నారు. దీనికి చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. తమ మద్దతు తెలుగు దేశానికే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బట్టీ చదువులొద్దు... లోకజ్ఞానం నేర్పండి.. పాదయాత్రలో చంద్రబాబు కేఎస్‌కే బాలికల కళాశాల వద్ద విద్యార్థినులతో ముచ్చటించారు. ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు బాలికల విద్యకు, మహిళల ఉద్యోగాల కల్పనకు అనేక చర్యలు తీసుకున్నానని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడి లక్ష కోట్లు దండుకుందని విమర్శించారు.

అవినీతి గురించి ఎంత మందికి తెలుసునని ఆయన విద్యార్థినులను ప్రశ్నించారు. దీనికి ఒక్కరి నుంచీ సమాధానం రాకపోవడంపై బాబు విస్మయం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పుస్తకాల్లోని చదువులను బట్టీ కొట్టించడం కాకుండా లోకజ్ఞానం పెంపొందించేలా విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని విద్యార్థినులను వివరించారు.

వృద్ధులకు రూ. 600 పింఛను పాదయాత్రలో పలువురు వృద్ధులను చంద్రబాబు ఆప్యాయంగా పలుకరించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చాక పింఛన్‌ను రూ. 600కు పెంచుతానని వారికి భరోసా కల్పించారు.అలాగే గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు దళితులతో కొద్ది సేపు మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పలువురు చంద్రబాబును కలసి కోరారు. దీనికి స్పందించిన ఆయన తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సమాన పనికి సమాన వేతనం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు, దూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నక్కా ఆనందబాబు, మన్నవ సుబ్బారావు, గ్రేటర్ హైదరబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, కృష్ణాజిల్లా నాయకులు గరికపాటి మోహనరావు, కంటమనేని రవిశంకర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వస్తున్నా మీ కోసం సైడ్ లైట్స్ .. * పాదయాత్రలో పలు చోట్ల చంద్రబాబు వృద్ధులను పలుకరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

* నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని, వారి కోసం అవినీతి రహిత సమాజమే థ్యేయమంటూ చంద్రబాబు పలు చోట్ల ఉద్ఘాటించారు.

* వేమూరు పార్టీ నాయకులు దారిపొడవునా పూలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు.

* కొబ్బరి బొండాల విక్రేత, దర్జీ, ఇస్త్రీ, చేనేత కార్మికులతో చంద్రబాబు వారి సమస్యలు తెలుసుకున్నారు.

* పచారీ దుకాణానికి వెళ్లి నిత్యావసర వస్తువుల ధరలు అడిగి తెలుసుకున్నారు

* పలు చోట్ల చిన్నారులను దగ్గరకు తీసుకుని వారిని ముద్దాడారు.