December 22, 2012

అప్పులన్నీ రద్దు చేస్తా:చంద్రబాబు

నేత బజార్లు పెడతా!
అప్పటివరకు చిల్లిగవ్వ కూడా కట్టొద్దు
చేనేతలకు చంద్రబాబు పిలుపు
వెయ్యి కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
ఫెడరేషన్ ఏర్పాటకు హామీ

రె ౖతాంగం తరువాత ఆర్థిక వ్యవస్థలో ఆ స్థాయి వృ త్తి ప్రాధాన్యంగల రంగం చేనేత. ఇప్పటికే రైతాంగానికి గట్టి భరోసా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఇప్పుడు చేనేత సమస్యలపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నేత బజార్లు ఏర్పాటు చేస్తామని శనివారం ఆయన ప్రకటించారు. అంతేకాదు.. నేతన్నల అభ్యున్నతికి వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చిస్తామని, కార్పొరేషన్ గానీ ఫెడరేషన్ గానీ ఏర్పాటు చేసి ఆ రంగాన్ని అభివృద్ధి పరుస్తామని అభయమిచ్చారు.

రుణాలన్నీ మాఫీ చేస్తామని, అప్పటిదాకా చిల్లిగవ్వ కూడా కట్టొద్దని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రేకుర్తి, కరీంనగర్, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి గ్రామాల వరకు 16.6 కిలోమీటర్లు నడిచారు. చేనేత రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఈ సందర్భంగా జరిగిన సభల్లో తీవ్రంగా దుయ్యబట్టారు. చేనేత కార్మికులకు కనీస వేతనాలూ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార సంఘాలు కూడా 1300నుంచి 970కి పడిపోయాయని చెప్పారు.

పేరుకు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించినా ఇప్పటిదాకా కనీసం కోటి రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. "సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో ఐదు వేల కోట్లను వెచ్చించి చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తాం. వారి రుణాలన్నింటినీ మాఫీ చేస్తాం. అప్పటిదాకా వాటిని చెల్లించాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు. చేనేత వస్త్ర విక్రయాలపై 30 శాతం రిబేట్ ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.

చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తామని, లక్షా 50 వేల రూపాయలతో ఇల్లు కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. చేనేత యూనిట్లకు సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేస్తామని, వృద్ధులైన చేనేతలకు వేయి పింఛన్‌ను ఇప్పించే బాధ్యత తీసుకుంటానని, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామంటూ ఊరట కలిగించారు. పట్టు, నూలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఆప్కో సంస్థలను పటిష్టం చేసి మార్కెటింగ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు. కనీస వేతనాలు కల్పిస్తామని, చేనేత ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.

విద్యుత్ సబ్సిడీ, మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రత్యేక పాలసీని ప్రకటించి ప్రమోట్ చేస్తామని చెప్పారు. చేనేత కార్మికుల పిల్లలను ఉచితంగా చదివిస్తామని, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు పునరావాసం కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు చూపెడతామని హామీ ఇచ్చారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏప్రిల్‌లో మరో పది వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీలను ప్రజలపై మోపేందుకు సిద్ధమవుతున్నదని చంద్రబాబు ఆరోపించారు. 2007 నుంచి 5600 కోట్ల రూపాయల సర్‌చార్జి భారాన్ని మోపిందని విమర్శించారు.

ఇదిలాఉండగా, మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్ ఫైల్‌ను గవర్నర్ చీవాట్లు పెట్టి తిప్పి పంపినందున రోషం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి నీతి, నిజాయితీగా ఉంటామని, పక్షపాతానికి తావివ్వబోమని చెప్పి అవినీతిపరులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పకుండా ఇతరులను చెప్పమంటున్నదని ఆరోపించారు.

అందరూ అభిప్రాయం చెప్పండి..మేం మాత్రం చెప్పం అనడం న్యాయమా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలని చూస్తున్న కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను నమ్మవద్దని కోరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలిసి పోయిందని, కేసులు మాఫీ చేస్తే నేడో, రేపో వైసీపీ కూడా కలుస్తుందని జోస్యం పలికారు. ఇక ఈ దిశగా కేసీఆర్ ఇప్పటికే రాయబారాలు పంపారని విమర్శించారు.
No comments :

No comments :