December 14, 2012
చేరాలంటే జైలుకెళ్లి దండం పెట్టుకోవాలి
అదిలాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలంటే అక్రమాస్తుల కేసులో
అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప
పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి దండం
పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
శుక్రవారం అన్నారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర అదిలాబాద్
జిల్లాలో కొనసాగుతోంది.
యాత్రలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ
పార్లమెంటు సభ్యులు వట్టి దద్దమ్మలు అని, అందుకే కేంద్రం నుండి నిధులు
తీసుకు రావడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. తాను పరిపాలించినప్పుడు
సమర్థవంతమైన పాలన అందించి ప్రపంచాన్ని ఆకర్షించానన్నారు. మరోసారి కాంగ్రెసు
పార్టీ అధికారంలోకి వస్తే ఇంటిపై కప్పు కూడా మిగలదన్నారు. కాంగ్రెసుది
దోపిడీ పాలన అన్నారు.
టిడిపి అధికారంలోకి వస్తే ప్రత్యేక డిఎస్సీ, విశ్వవిద్యాలయం, ప్రతి
జిల్లాలోనూ గిరిజన భవన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు
రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా, పూచీకత్తు లేకుండా రుణాలిస్తామని చెప్పారు.
ఎస్టీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో, ఉపాధిలో ఇరవై శాతం రిజర్వేషన్లు
కల్పిస్తామన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తామని
హామీ ఇచ్చారు.
అదిలాబాద్ జిల్లాలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర నేటితో ముగిసి.. కరీంనగర్
జిల్లాలో ప్రవేశించనుంది. అదిలాబాదులో బాబు పాదయాత్ర నేడు తొమ్మిదో రోజు.
ఖానాపూర్ మండలం దిమ్మదుర్తి నుంచి ప్రారంభమైంది. ఎక్లాస్పూర్, ఖానాపూర్
క్రాస్ రోడ్డు, సుల్జాపూర్, జదనాకృతి మీదుగా కరీంనగర్ జిల్లాలో
ప్రవేశిస్తుంది.
Posted by
arjun
at
11:08 AM