November 24, 2012

ఈ సీఎంని జైల్లో పెట్టాలి :చంద్రబాబు

ఈ సీఎంని జైల్లో పెట్టాలి
అవినీతి మంత్రి ధర్మానను కాపాడుకున్నాడు
దొంగలను వెనకేసుకున్నాడు
జీవో మంత్రులకూ అండగా నిలుస్తున్నాడు
మెదక్ జిల్లా పాదయాత్రలో
కిరణ్‌పై బాబు నిప్పులు
ఏమి చేశారని రెండేళ్ల సంబరాలని ప్రశ్న
బ్రిటీషర్ల కన్నా వైఎస్సే ఎక్కువ దోచాడని ధ్వజం
రుణ మాఫీపై చర్చకు కాంగ్రెస్, వైసీపీలకి సవాల్
ఆ రెండు పార్టీలు వస్తే ఇళ్లపై కప్పులూ ఉండవని వ్యాఖ్య

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత మరోసారి చెలరేగి విమర్శలు చేశారు. రుణ మాఫీకి 'కిరికిరి' పెడుతున్న కిరణ్...అవినీతి మంత్రులను మాత్రం బాగా వెనకేసుకువస్తున్నారని చంద్రబాబు కన్నెర్ర చేశారు. వాన్‌పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ చార్జిషీట్ వేయగా.. సీఎం క్లీన్‌చిట్ ఇస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి సీఎం పాలనకు పనికిరాడని, తక్షణం జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్లలో ఏమి చేశారని సంబరాలు జరుపుకొంటారని మెదక్‌జిల్లా పాదయాత్రలో నేరుగా కిరణ్‌ను నిలదీశారు. రైతుల రుణమాఫీపై బహి రంగ చర్చకు రావాలని కాంగ్రెస్, వైసీపీ నేతలనూ సవాల్ చేశారు. ఆ రెండు పార్టీలను గెలిపిస్తే ఇళ్ల కప్పులూ మిగలనివ్వరని హెచ్చరించారు. జగన్ దోచుకున్న లక్ష కోట్లను స్వాధీనం చేసుకొంటే ఒకటి కాదు.. మూడు సార్లు రుణమాఫీ చేయొచ్చునని స్పష్టం చేశారు. దొంగలూ దోపిడీలూ పోయి రాష్ట్రమూ ప్రజలూ అభివృద్ధి చెందేందుకు టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అలాచేస్తే.. బీఎడ్ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టుల్లో భర్తీ చేస్తామని, 'టెట్' రద్దు చేసి ఏటా డీఎస్సీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ముస్లింల కోసం ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంకును పెట్టి వడ్డీ లేని రుణం అందిస్తామని, ప్రత్యేక డీఎస్సీల ద్వారా ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, ఇమామ్‌లకు రూ. ఐదు వేలు, మౌజమ్‌లకు రూ. మూడు వేల చొప్పున వేతనాలు అందిస్తామని వాగ్దానం చేశారు. బీసీల కోసం పది వేల కోట్లతో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని, గొల్లకురుమల కోసం రూ. 500 కోట్లతో బడ్జెట్ రూపొందిస్తామని భరోసా ఇచ్చారు.

సంగారెడ్డి , నవంబర్ 24 (ఆంధ్రజ్యోతి) : అవినీతి మంత్రి ధర్మాన ప్రసాదరావును కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని జైలులో పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. దొంగలను కాపాడే ముఖ్యమంత్రిని ఏమనాలని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. చార్జిషీట్‌లో మంత్రి పేరును సీబీఐ ప్రస్తావించినా "ధర్మాన తప్పు ఏమీ లేద''ని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడం విడ్డూరమని ధ్వజమెత్తారు. తెల్లదొరల పాలనలో జరిగిన దోపిడీకన్నా వైఎస్ ఎక్కువగా దోచుకున్నారని ఘాటుగా విమర్శించారు.

మెదక్ జిల్లాలో ఏడో రోజయిన శనివారం న్యాల్‌కల్, మనూర్ మండలాల్లో చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. పలు ప్రాంతాలలో జరిగిన సభల్లో కిరణ్, కాంగ్రెస్, వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. వాన్‌పిక్ భూముల కేటాయింపులో ధర్మాన ప్రసాద్‌రావు డబ్బులు తిని సంతకాలు చేశారని విమర్శించారు. 26 జీవోలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులిస్తే వారికీ ముఖ్యమంత్రి అండగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. " ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్నానని గొప్పగా చెప్పుకుంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ కాలమంతా ఏమి సాధించారు? మద్యం సిండికేట్‌ల వ్యవహారంలో 1100 మంది ఉద్యోగులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.

మరి ఈ కేసులో మంత్రుల మాటేమిటి?. సిండికేట్లలో దోచుకున్న వారంతా హాయిగా ఉన్నారు. బొత్స మాఫియా లిక్కర్ డాన్ అని ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ అ«ధిష్ఠానానికి లేఖ రాశారు'' అని గుర్తుచేశారు. రైతులకు రుణాలను మాఫీ చేస్తానని తాను ప్రకటిస్తే ఎలా చేస్తారో చెప్పాలని కాంగ్రెస్, వైసీపీ ప్రశ్నించడం అర్ధరహితమన్నారు. జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంటే ఒక్కసారి కాదు మూడుసార్లు రైతుల రుణాలను మాఫీ చేయవచ్చన్నారు. దీనిపై ఆ పార్టీలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రుణమాఫీ ఎలా సాధ్యమో నిరూపిస్తామని స్పష్టం చేశారు. కాగా, తెలుగుదేశం అధికారంలోకి రాగానే 'టెట్'రద్దు చేసి ఏటా డీఎస్పీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు తెలిపారు.

బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రూపాయి కిలో బియ్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి 'నగదు బదిలీ' చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మైనారిటీల కోసం ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మైనారిటీలకు ఈ బ్యాంక్ ద్వారానే మార్జిన్‌మనీ, రుణాలు అందిస్తామన్నారు. బడ్జెట్‌లో 2,500 కోట్ల రూపాయలను కేటాయించి ఆర్థికాభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇమామ్‌లకు, మౌజమ్‌లకు రూ.5 వేలు, రూ. 3 వేల చొప్పున వేతనాలు ఇస్తామని ప్రకటించారు.

స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉంటే ఇప్పటికే ఎన్నికలు నిర్వహించే వారమన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, వారికోసం పది వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. గొల్లకురుమల కోసం 500 కోట్లతో బడ్జెట్ రూపొందించి, వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు.

కాంగ్రెస్, వైసీపీలు అధికారంలోకి వస్తే మన ఇళ్లపై కప్పులు ఉండవని, బతుకు అధోగతేనన్నారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, తెలుగుదేశం అధికారంలోకి రావాలని చెప్పారు.

ఇషాంత్‌రెడ్డి తండ్రికి పరామర్శ
తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న బసంత్ పూర్‌కు చెందిన ఇషాంత్‌రెడ్డి తండ్రి ఇంద్రసేనారెడ్డి శనివారం చంద్రబాబును కలిశారు. ఇబ్రహీంపూర్-చాల్కి చౌరస్తాల మధ్య కొద్దిసేపు బాబుతో కలిసి నడిచారు. కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఇంద్రసేనారెడ్డిని ఈ సందర్భంగా చంద్రబాబు ఓదార్చారు. అధికారంలోకి వస్తే ఇషాంత్‌రెడ్డి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.