November 24, 2012

భారతి! చంద్రబాబు అనుభవం అంతలేదు నీ వయస్సు -పయ్యావుల కేశవ్

హైదరాబాద్, నవంబర్ 24 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడ్ని విమర్శించే స్థాయి లేదని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీతో కుమ్మక్కయి, రహస్య ఒప్పందాలు చేసుకుని గేమ్ ఆడుతున్న వైఎస్సార్ సీపీ కాంగ్రెస్‌లో భవిష్యత్‌లో కలవబోమని చెప్పగలరా అని కేశవ్ ప్రశ్నించారు. యుపీఏ ఛైరపర్సన్ సోనియా గాంధీని విమర్శిస్తూ ఒక్క మాటగూడా మాట్లాడడంలేదని ఆయన మండిపడ్డారు.

మొదటి నుంచి కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ, అవినీతిపై పోరాటం చేస్తుంది ఒక్క టీడీపీయేనని, అలాంటి కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం చేసుకుంది టీడీపీయా, వైఎస్సార్‌సీపీయా అన్నది భారతి తెలుసుకోవాలని కేశవ్ సూచించారు. చంద్రబాబు అనుభవం అంతలేదు మీ వయస్సు, ఆయనను విమర్శించే స్థాయికూడా కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఎదుట వారిని వేలెత్తి చేపించే ముందు మీ తప్పులను తెలుసుకోవాలని కేశవ్ అన్నారు. కార్పొరేట్ రంగాన్ని శాసించే స్థాయి టీడీపీకి ఉందని చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండేళ్ల పాలన విఫలమైందని ఆయన విమర్శించారు. తాను మారబోనని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలే మార్చేస్తారని ఆయన అన్నారు. పదేళ్లనాటి తెలుగుదేశం పాలనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.
No comments :

No comments :