September 19, 2013

. తెలంగాణ ప్రజల హృదయాల నుం చి తమను దూరంచేయడం ఎవరితరమూ కాదు...........




  ఈ నెల 21వ తేదీన ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించా రు. 'అందరికీ న్యాయం జరగాలని టీడీపీ కోరుకుంటోం ది. ఎన్నికల కోసమో, రాజకీయ లబ్ధికోసమో విద్వేషాలు రగిలించడం సరికాదు. మీకు ఇబ్బంది ఉంటే పార్టీలను పక్కనపెట్టండి. ఇరువైపులా జేఏసీలు, విద్యార్థులు, ప్రజా సంఘాలను పిలిచి మాట్లాడండి. సమస్యలు తెలుసుకొని పరిష్కరించండి. రాష్ట్రపతికి ఇదే విజ్ఞప్తి చేస్తాను' అని వెల్లడించారు. ఎక్సయిజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ (విజయవాడ)గా చేసి ఇంకా పదేళ్ళు సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన బాణోత్ మోహన్‌లాల్ గురువారం ఇక్కడ టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను అభివృద్ధి చేసింది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమస్యలపై పోరాడింది ఒక్క టీడీపీయేనన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల నుం చి తమను దూరంచేయడం ఎవరితరమూ కాదన్నారు. బయ్యారంలో లక్షన్నర ఎకరాల ఇనుప ఖనిజం గనులను వైఎస్ తన అల్లుడికి రాసిచ్చినప్పుడు టీడీపీ ఒక్కటే నిలబడి పోరాడిందని, ఆ రోజు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 'మూడేళ్లు తెలంగాణలో ఆందోళనలు. కొందరు చనిపోయారు. ఇప్పుడు రెండో వైపు ఉద్యమాలు. సమస్య పరిష్కరించాలని మనం కోరితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేశారు.

చిత్తశుద్ధి ఉంటే ఈ తొమ్మిదేళ్లు ఏంచేశారు? సరిగ్గా ఎన్నికల ముందే గుర్తుకొచ్చిందా? ప్రకటన చేసిన నోటితోనే టీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడతారు. విలీనం కోసం చేసిన ప్రకటనా లేక ప్రజల కోసం చేసిందా? జగన్ పార్టీ డీఎన్ఎ, తమ డీఎన్ఎ ఒకటేనని గొప్పగా చెప్పుకొంటున్నారు. దొంగల డీఎన్ఎ మీదీ ఒకటేనంటే ఇద్దరూ ఒకటేనన్నమాట. మొద్దబ్బాయి ప్రధాని కావాలి... ఇక్కడ దొంగబ్బాయి సీఎం కావాలి. ఎలాగైనా టీడీపీ గెలవకూడా చేయాలి. ఖబడ్దార్... మీరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌కు సమాధానం చెబుతాం. తిరుగులేని శక్తిగా అవతరిస్తాం. ఈ సారి టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు' అని ఆయన ప్రకటించారు.

ఈసారి టీడీపీ గెలిస్తే ఐదు వందల జనాభా ఉన్న ప్రతి గిరిజన గ్రామాన్ని పంచాయతీ చేస్తామని, జిల్లా యూనిట్‌గా గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని, గిరిజనుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని, గిరిజన రైతులకు రూ.ఐదు లక్షల వరకూ పూచీలేని రుణం ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మోహన్‌లాల్‌ను వరంగల్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఈసారి మెజారిటీ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ధీమా వ్యక్తం చేశారు. కాగా, చంద్రబాబు ఈ నెల 21న ఢిల్లీ వెళ్లి 23వరకు అక్కడే ఉంటారు. 21న ఆయనకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ లభించగా, వివిధ పార్టీల నేతలను కలిసేందుకు 22న అక్కడే ఉంటున్నారు. మరునాడు జాతీయ సమగ్రతా మండలి సదస్సులో పాల్గొంటారు.


courtesy: andhrajyothy