September 19, 2013

జగన్ బెయిల్‌కు ఏం తొందర వచ్చిందని దాని కోసం మీరంతా తిరుగుతున్నారు?

'రాష్ట్రం తగలబడుతుంటే దానిని వదిలిపెట్టి చంద్రబాబు తన ఆస్తులు ఇప్పుడు ఎందుకు ప్రకటించాలని జగన్ పార్టీ నేతలు అడుగుతున్నారు. రాష్ట్రం తగలబడుతుంటే ఇప్పుడు జగన్ బెయిల్‌కు ఏం తొందర వచ్చిందని దాని కోసం మీరంతా తిరుగుతున్నారు? ఆయన ఇంకో ఏడాదో, ఆరు నెల్లో జైల్లో ఉంటే ఏం కొంపలంటుకు పోవుగదా! వాళ్ళు కూడా టైం ప్రకారం భోజనం, టిఫిన్ పెడతానే ఉంటారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చేసేది కూడా ఏమీ లేదు' అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. అవినీతిపై పోరాటంలో ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించారని, జగన్ సహా వైఎస్ కుటుంబంలోని వారంతా తాము కూడా తమ ఆస్తులు ప్రకటించి సగర్వంగా నిలబడే బదులు చంద్రబాబును తిట్టిపోయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. 'చంద్రబాబు తనకు ఉన్న మొత్తం ఆస్తుల వివరాలు ఇచ్చేశారు. ఇంకా తనకు ఏవైనా ఉంటే చూపించమని సవాల్ విసిరారు. దాని జోలికి పోకుండా కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు అందులో ఏవో వెతికే ప్రయత్నం చేస్తున్నారు. తన ఆస్తులు తాను కొన్ననాటి రేటును చంద్రబాబు చెప్పారు. ఈ రోజు రేటు చెప్పలేదు. మార్కెట్ ధరలు రోజుకో రకంగా మారుతుంటాయి. వాటిని అమ్మితే నిజంగా ఆ రోజు ధర తెలుస్తుంది. జగన్ కుటుంబంలో ఏ ఒక్కరూ తమ ఆస్తులు చెప్పరు...తమకు ఎన్ని కంపెనీలుఉన్నాయో...వాటికి అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పరు. ఎవరైనా స్వచ్ఛందంగా చెబితే వారిపై ఒంటి కాలిపై లేస్తున్నారు. తమను కూడా ప్రజలు నిలదీస్తారేమోనన్న భయం వారిని పట్టుకొంది' అని రేవంత్ విమర్శించారు.
వైఎస్ కుటుంబంలోని వారు తమ ఆస్తులేగాక చివరకు తమ కుటుంబ సభ్యులు ఎవరో కూడా చెప్పుకోలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 'షర్మిల తాను రాజన్న కూతురునని...జగనన్న చెల్లెలని చెప్పుకొంటారుగాని బ్రదర్ అనిల్ భార్య అని ఎక్కడా చెప్పుకోరు. లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు కుటుంబంలో చేరి చిచ్చు పెట్టినట్లు షర్మిల బ్రదర్ అనిల్ కుటుంబంలో చేరి చిచ్చు పెట్టారు. అనిల్ భార్యా బిడ్డలకు షర్మిల చేసింది ద్రోహం కాదా? చంద్రబాబు కోడలు బ్రాహ్మణి పెట్టుకొన్న వజ్రాల గొలుసు లెక్కేదంటూ జగన్ పార్టీ నేతలు కుంటి కూతలు కూస్తున్నారు. బ్రాహ్మణి తాత ఒక పెద్ద అగ్ర హీరో. ముఖ్యమంత్రిగా చేశారు. ఆమె తండ్రి సినీ పరిశ్రమలో మరో పెద్ద హీరో. ఆమెకు వజ్రాల గొలుసు కొనుక్కొనే తాహతు లేదా? జగన్‌ను చూడటానికి భారతి జైలుకు వెళ్ళేటప్పుడు పెట్టుకొనే వజ్రాల దిద్దుల లెక్కలు మీరు ఏనాడైనా చెప్పారా? అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దోచుకొన్న మీరు కూడా ఇతరుల గురించి మాట్లాడతారా? మీరు అబద్ధాలు మాట్లాడటం మానకపోతే మేం మీ గురించి మరిన్ని నిజాలు మాట్లాడాల్సి ఉంటుంది' అని ఆయన హెచ్చరించారు.
గుమస్తా ఉద్యోగం ఇచ్చిన గని యజమాని వెంకట నరసయ్యను చంపి ఆ గనిని హస్తగతం చేసుకొన్న వైఎస్ కుటుంబానికి ఉన్న నేర చరిత్ర తరాల తరబడి కొనసాగుతోందని, చంద్రబాబు కుటుంబానికి అటువంటి నేర చరిత్ర లేదని జగన్ పార్టీ నేతలు గుర్తించాలని ఆయన సూచించారు.