July 21, 2013

రైతుల్ని కూలీలుగా మారుస్తున్న ప్రభుత్వం - కోడెల


కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా, రైతు సంక్షేమాల నుండి తప్పుకుంటోందని టిడిపి నేత కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయ్యాయని వివరించారు. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయని, హెలికాఫ్టర్ల ద్వారా బాధితులకు ఆహారాన్ని అందించే పరిస్థితి ఉందన్నారు. వరద ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన తీసుకునే చర్యలు సరిగా లేవని ఈ సందర్భంగా కోడెల విమర్శించారు. ప్రభుత్వం జిల్లాకొక ఇంఛార్జిని పెట్టినప్పటికీ జరగాల్సిన నివారణ చర్యలు సరిగ్గా జరగడం లేదనేది వాస్తవమన్నారు. అదేవిధంగా రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయని, కనుక ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్ళ కాలంలో పరిస్థితిని చూస్తే 35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ సేద్యం తగ్గిపోయిందని, రైతులు సేద్యాన్ని మానేస్తున్నారని, గత తొమ్మిది సంవత్సరాల్లో 13 లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని మానేశారన్నారు. రైతులు, రైతు కూలీలుగా మారిపోతున్నారన్నారు. 31 లక్షల మంది రైతులు కూలీలుగా మారిపోయారని వివరించారు. దాదాపు 12 లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. సెజ్ లు, రోడ్డు వెడల్పు పేరుతో సంవత్సరానికి రెండు పంటలు పండే భూముల్ని సైతం ప్రభుత్వం సేకరిస్తుందని వివరించారు. దీంతో అనేక మంది వ్యవసాయాన్ని వదిలేశారని, మిగిలిన వారు చేద్దామన్నా అనుకూల పరిస్థితులు లేవన్నారు.విత్తనాలన్నీ ఇంతకుముందు 50 శాతం సబ్సిడీతో ఇచ్చేవారని, దాన్ని 33 శాతం సబ్సిడీగా తగ్గించివేశారన్నారు. సబ్సిడీ విత్తనాల ధరను 5 శాతం నుండి 15 శాతం వరకు రేట్లు పెంచేశారని చెప్పారు. ఇదే ధరకు బయట మార్కెట్లో నాణ్యమైన విత్తనాలు దొరుకుతున్న పరిస్థితి వుంది. విత్తనాల కంపెనీలకో, సర్టిఫైడ్ సీడ్స్ కంపెనీలకో సహాయం చేస్తున్న పరిస్థితి తప్ప సబ్సిడీ విత్తనాలతో ప్రభుత్వం చేసే సహాయం శూన్యమని విమర్శించారు.