July 18, 2013

కాంగ్రెస్‌ను ఓడించాలి: ఎర్రబెల్లి


స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి.. గ్రామాభివృద్ధికి సహకరించాలని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలను కోరారు. బుధవా రం వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల నుంచి భారీగా చేరుతున్నారంటూ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెబుతున్నారని విమర్శించారు.

గ్రామాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని, టీడీపీ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. అందుకే ప్రజలు మళ్లీ టీడీపీ పాలన కోరుకుంటున్నారన్నారు. కొందరు తెలంగాణ సెంటిమెంట్‌తో ఓట్లు అడుగుతున్నా వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చిత్తశుద్ధిలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులతోపాటు, పెన్షన్ల స్వాహాకు పాల్పడ్డారని ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని 101 గ్రామ పంచాయతీలకు 60 పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.