July 16, 2013

పంచాయతీ సంగ్రామంలో టీడీపీ ముందంజ

పంచాయతీ పోరులో తెలుగుదేశం దూసుకెళ్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో జరగనున్న పోలింగ్‌కు ముందే ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ప్రస్తుతానికి మెజార్టీ పంచాయతీల్లో పాగ వేశారు. పోలింగ్‌కు ముందే తాము బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీలపై టీడీపీ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబర్చిం ది. టీడీపీ బలపర్చిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో తమ్ముళ్ల ముఖాల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చూస్తుంటే ప్రజల్లో పార్టీ పట్ల నెలకొన్న సానుకూల వాతావరణం స్పష్టమవుతోందని టీడీపీ నేతలు వ్యాఖ్యాని స్తున్నారు. పంచాయతీ ఎన్నికల పునాదులపై సాధారణ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే ఈ ఎన్నికలను మొదటి నుండి టీడీపీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది.

మిగతా పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికలను అషామాషీగా తీసుకోగా, టీడీపీ నాయకత్వం మాత్రం ఎక్కడ పోరపాట్లకు తావివ్వకుండా ముఖ్యనేతలను గ్రామాల్లోనే మకాం వేసేలా చొరవ తీసుకుంది. బలమైన కార్యకర్తల బలగం కలిగిన మెజార్టీ పంచాయతీలను ఏకగ్రీవంగా నెగ్గడం ద్వారా మరోసారి తన సత్తా చాటుకుంది. ఒకవైపు రాష్ట్ర రాజకీయాలను తెలంగాణ పరిణామాలు ఉక్కిరి, బిక్కిరి చేస్తుంటే టీడీపీ నాయకత్వం మాత్రం తమకేమి సంబంధం లేని వ్యవహారమన్నట్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇరు ప్రాంతాల నేతలు సంయమనంతో వ్యవహరించేలా చంద్రబాబు కట్టడి చేయగలిగారు. తెలంగాణ అంశంపై తాము చెప్పాల్సింది ఇప్పటికే చెప్పామని ఆయన కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీయేనంటూ బంతిని వారి కోర్టులోకి నెట్టివేశారు.

తాజా సమాచారం ప్రకారం టీడీపీ బలపర్చిన 415 మంది సర్పంచ్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ మద్దతుతో 200 మంది, వైస్సార్సీపీ బలపర్చిన 116, టీఆర్‌ఎస్‌ దన్నుతో 29 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా సర్పంచ్‌ పీఠాలపై కోలువుదీరను న్నారనున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ మొదటి నుండి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఆ పార్టీ లాభించిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మూడు దశల పంచాయతీ పోరులోనూ ఇదే తరహా ఫలితాలు వెలువడం ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ కంటే టీడీపీ బలపర్చిన అభ్యర్థులు రెండింతల సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతానికి మెజార్టీ సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకోవడంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తాము బలపర్చిన అభ్యర్థుల ఏకగ్రీవాలపైనే ముఖ్యనేతలంత అత్యధికంగా దృష్టిసారించి, అనుకున్నది సాధించారు.

మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందు మెజార్టీ పంచాయతీ స్థానాల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవం ఎన్నుకునేలా పథక రచన చేయడం ద్వారా నేతలు, పార్టీ శ్రేణుల్లో సమరో త్సాహాన్ని నింపినట్లయింది.పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా...మీకోసం’ పాదయాత్ర ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. పోలింగ్‌కు ముందే టీడీపీ బలపర్చిన అభ్యర్థుల ఏకగ్రీవానికి బాబు చేపట్టిన పాదయాత్ర ఎంతో కలిసొచ్చిందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 218 రోజుల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసిన చంద్రబాబు అభివృద్ధిపై ఇచ్చిన హామీలను ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారన్నారు. అందుకే బాబు నాయకత్వాన్ని బలపర్చేందుకు టీడీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఓటర్లు మొగ్గు చూపారంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో జరగనున్న పోలింగ్‌కు ముందే మెజార్టీ పంచాయతీలు గెల్చుకోవడం ద్వారా పార్టీ నేతలు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పేర్కొంటున్నారు.

మూడు దశల్లో జరిగే పంచాయితీ ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలను రాబట్టేందుకు అందరూ సమిష్టిగా పని చేయాలని చంద్రబాబు ముఖ్యనేతలకు టెలికాన్ఫరెన్సుల ద్వారా దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే అందరికంటే ముందే స్థానిక సదస్సుల ద్వారా పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన వైస్సార్‌సీపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటాడం ద్వారా రానున్న సాధారణ ఎన్నికలకు కేడర్‌ను సమాయాత్తం చేయాలని భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వానికి ప్రస్తుత పరిణామాలు ఏమాత్రం మింగుడుపడడం లేదని తెలుస్తోంది. వైస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులు కేవలం 116 స్థానాల్లోనే ఏకగ్రీవం ఎన్నిక కావడం ఆ పార్టీ పరిస్థితి ఏమిటో తెలియజేస్తుందన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ముందే పార్టీ నేతల మధ్య సిగపట్లు నాయకత్వాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి.

మరో వైపు అధికార కాంగ్రెస్‌ పార్టీ 200 స్థానాల్లో తమ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడడం ద్వారా, పంచాయతీ పోరులో పట్టు బిగించేందుకు తీవ్ర కసరత్తునే చేస్తున్నట్లు స్పష్టమ వుతోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పరిస్థితి గుడ్డిలో మెల్ల అన్న చందంగా తయారయింది. ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు కేవలం 29 స్థానాలకే పరిమితం కావడం గులాబీ దళపతిని అయోమయానికి గురి చేస్తోంది. అయితే మూడు దశల్లో జరిగే పంచాయితీ ఎన్నికల చాంపియన్‌గా ఎవరు నిలుస్తారన్నది ఈ నెలఖారు నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.