February 10, 2013

బాబుకు ప్రవాసాంద్రుల సంఘీభావం

తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రకు ప్రవాస భారతీయులు సంఘీభావం తెలుపుతున్నట్లు అట్లాంటా ఎన్ఆర్ఐ శాఖ అధ్యక్షులు మేదరమెట్ల మల్లిక్ తెలిపారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు అమెరికాలోని అట్లాంటాలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి మల్లిక్ మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్రను అమెరికాలోని ప్రవాస భారతీయులు స్వాగతిస్తున్నారన్నారు.

దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు స్పందించని విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నభూతో నభవిష్యతి అన్న రీతిలో చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టి ముందుకు సాగుతున్నారన్నారు. ఇది రాజకీయాల్లో ఒక మైలు రాయిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రమంతా చంద్రబాబు పర్యటించడాన్ని ఎన్ఆర్ఐలు నిశితంగా పరిశీలిస్తూ ఆకర్షితులవుతున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడే చంద్రబాబు అవసరం ర్రాష్టానికి ఉందన్న నిర్ణయాన్ని వారు వెలిబుచ్చుతున్నట్లు చెప్పారు.

పాదయాత్రకు జనం నుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రజలకు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అవగతమవుతుందన్నారు. ఇది ప్రభుత్వ అసమర్థ, అవినీతి విధానాలకు అద్దం పడుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రవాసాంధ్రులు వెంకట్ అక్కినేని, సుమన్ కాట్రగడ్డ, అజయ్ ఘంటమనేని తదితరులు పాల్గొన్నారు.