January 29, 2013

బస్సులోనే బాబు

పాదయాత్రకు బ్రేక్ ఇవ్వటంతో బహుదూరపు బాటసారి మరో రెండు రోజులు పరిటాల వద్ద బస్సులోనే గడపనున్నారు. హైదరాబాదు నుంచి వైద్య పరీక్షల నివేదికలు సోమవారం సాయంత్రం అందగానే పాదయాత్రకు రెండు రోజులు విరామం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. గ్రీన్‌వేలో బస చేసిన చంద్రబాబు శిబిరం లోపలికి పార్టీ కార్యకర్తలను కూడా పోలీసులు అనుమతించటం లేదు. సోమవారం బాబును అతికొద్ది మంది నాయకులు మాత్రమే కలిసి మాట్లాడారు.ఉమా ప్రత్యేక పూజలు చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు పరిటాల ఆంజనేయస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో టీడీపీ నేతలు, మాగంటి పుల్లారావు, డాక్టర్, వీరాస్వామి, శ్రీనివాస్ ప్రసాద్ , బి. సూర్యప్రకాష్, గుత్తా రమేష్ తదితరులు పొల్గొన్నారు.

స్వామి ప్రసాదాన్ని బాబుకు అందచేశారు. అక్టోబర్ రెండున ప్రారంభించిన పాదయాత్ర ఈనెల 26కు 117 రోజులు పూర్తైంది. ఆరోజున చారిత్రక ప్రసిద్ధిచెందిన పరిటాల గ్రామంలో కేశినేని నాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 117 అడుగుల పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. వైద్య పరీక్షల నివేదికలు హైదరాబాదు నుంచి సోమవారం సాయంత్రానికి అందాయి. మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. వైద్యుల బృందం తప్పనిసరిగా మూడు రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ చంద్రబాబు అంగీకరించ లేదు. ప్రజల కోసం పాదయాత్ర కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్న బాబు కేవలం రెండు రోజులు ఈనెల 29, 30 తేదీలలో విశ్రాంతి తీసుకునేందుకు అంగీకరించారని సాయంత్రం శిబిరం వద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు మీడియాకు చెప్పారు.

31 మధ్యాహ్నం నుంచి మైలవరం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. కొద్ది రోజులు పాటు రోజుకు ఏడు నుంచి పది కిలోమీటర్లు మాత్రమే నడిచి విశ్రాంతి తీసుకుంటే మంచిదన్న వైద్యుల సూచనను పార్టీ వర్గాలు ఉటంకిస్తున్నాయి. సోమవారం కూడా బాబు బస్సు నుంచి బయటకు రాలేదు. ఉదయం జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా, స్థానిక శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు, పాదయాత్ర విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎంఎల్ఏ పరసా రత్నం, కోగ ంటి బాబు, చంద్రబాబును కల్సి కొద్దిసేపు మాట్లాడారు.