December 1, 2012

కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు!: చంద్రబాబు

చెప్పిన మాట చెప్పకుండా గారడీ చేస్తాడు
ఎప్పుడో అప్పుడు కాంగ్రెస్‌లో కలిసేవాడే
గిరిజన మహిళ నిజాయితీ కూడా వైఎస్‌కు లేదు
కొడుకుకు లక్ష కోట్లు దోచి పెట్టాడు
నిజామాబాద్ పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు


నిజామాబాద్, నవంబర్ 30 (ఆంధ్రజ్యోతి): "కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు. చెప్పిన అబద్ధం మళ్లీ చెప్పకుండా పుట్టెడు మాటలు చెబుతాడు. కేసీఆర్ మన వెంట ఉన్నవాడే. 6 నెలలు కుంభ కర్ణుడిలా నిద్రపోతాడు. ఒకరోజు లేచి మాటల గారడీ చేస్తాడు. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్‌లో కలిసే పార్టే. కలుపుతానని కేసీఆరే స్వయంగా చెప్పాడు'' అంటూ టీఆర్ఎస్ అధినేతపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చండ్రనిప్పులు కక్కారు. "మాయగాళ్ల మాటలు నమ్మకండి. మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇకనైనా ఆలోచించండి'' అని ప్రజలను కోరారు.

నిజామాబాద్ జిల్లాలో ఒకప్పటి టీడీపీ స్థానం, ప్రస్తుతం టీఆర్ఎస్ ఇలాకా అయిన బాన్సువాడలో శుక్రవారం చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పట్టారు. అంతకుముందు పిట్లం మండలం బొల్లక్‌పల్లి గ్రామం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సమయంలో ఆయనను డ్వాక్రా మహిళలు వచ్చి కలిశారు. "డ్వాక్రా మహిళలకు నాటి విలువ ఇప్పుడు లేదు. మీరు ఊతమిచ్చి జీవితాలు నిలబెట్టారు. కానీ ఇప్పుడు పావలా వడ్డీ అని పరిహాసం చేస్తున్నార''ని భూదవ్వ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాన్సువాడ మండలం తాడ్కోల్, సోమేశ్వర్‌ల్లో కూడా మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

అనంతరం బాన్సువాడ పట్టణంలో జరిగిన సభలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బాబ్లీ ప్రాజెక్టుకు నిరసనగా తాను జైలుకు వెళ్లానని, ఆ పోరాటం సమయంలో టీఆర్ఎస్ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు."తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశాను. నాతో పాటు కుటుంబ సభ్యులందరి ఆస్తులు ప్రకటించాను. ఆ దమ్ము కేసీఆర్‌కు, జగన్‌కు ఉన్నాయా?'' అని ప్రశ్నించారు. వైఎస్ సీఎంగా ఉండగా తన కొడుకుకు లక్ష కోట్లు దోచిపెట్టాడని, ఒక మామూలు గిరిజన వృద్ధురాలికి ఉండే నిజాయితీ సైతం వైఎస్‌కు లేకుండా పోయిందని దుయ్య బట్టారు. వైఎస్ తనకొడుకును అదుపుచేసి ఉంటే నేడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఈ క ష్టాలు వచ్చి ఉండేవికావని చెప్పారు.

కేసులు ఎత్తేస్తే జగన్ పార్టీ కూడా కాంగ్రెస్‌లో కలుస్తుందన్నారు. "పార్టీల పనితీరును బట్టి ప్రజలు ఆలోచించాలి. నేను చెప్పింది వాస్తవం అయితేనే సహకరించాలి. ప్రలోభాలకు లొంగకూడదు'' అని కోరారు. తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని మరో సారి స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలు 8 లక్షల కోట్లు దోచుకుతిన్నారని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు పదివేల కోట్ల ప్యాకేజీతోపాటు వంద సీట్లు ఇస్తామని చెప్పారు. గీత కార్మికులకు శాశ్వత లైసెన్సు ఇస్తామని ప్రకటించారు.

ఎస్టీల వివాహాలతో పాటు మైనార్టీ వివాహాలకు కూడా రూ.50వేల సహాయం అందిస్తామని చెప్పారు. 1.65 కోట్ల మందికి సబ్సిడీ సిలిండర్లు ఇస్తామని చెప్పారు."పల్లకీ మోయడం కాదు.. పల్లకీ ఎక్కడం నేర్చుకోవాల''ని బీసీలను కోరారు. ఎస్సీ సబ్ ప్ల్లాన్‌లో మాదిగలకు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.