November 3, 2012

నేటి నుంచి మళ్లీ బాబు పాదయాత్ర



 టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా, మీ కోసం' పాదయాత్ర ఆదివారం నుంచి తిరిగి కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలం పెద్దచింతకుంట నుంచి ప్రారంభమై, వెంకటాపూర్, తీలేరు, మరికల్, మాధవరం, రాంకిష్టయ్యపల్లి ద్వారా కిష్టాపూర్ చేరుకుని రాత్రి బస చేస్తారు. రోడ్డు ప్రమాదంలో పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు దుర్మరణం చెందడంతో, శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన చంద్రబాబు, శనివారం సాయంత్రం ఐదు గంటలకు తిరిగి ఇక్కడకు చేరుకున్నారు.

ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలో చంద్రబాబు మొత్తం 537 కిలోమీటర్లు నడిచారు. జిల్లా విషయానికి వస్తే 137 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. పాదయాత్ర, మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 7 వరకూ కొనసాగే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలిపాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, ఈనెల 5 వరకే జిల్లాలో యాత్ర కొనసాగి, రంగారెడ్డి జిల్లా పరిగికి చేరాల్సి ఉంది. అయితే, 2 రోజులు ఆలస్యం కావడంతో 7 సాయంత్రం ఈ జిల్లాలో పాదయాత్ర ముగిసే అవకాశముంది.

No comments :

No comments :