November 26, 2012

తెలంగాణ ప్రజలకు ఉపాధి అక్కర్లేదా?చంద్రబాబు

కేసీఆర్.. నీ బిడ్డలకేనా కొలువులు?
తెలంగాణ ప్రజలకు ఉపాధి అక్కర్లేదా?
కేంద్ర మంత్రిగా ఎన్ని ఉద్యోగాలు తెచ్చావు?
చంద్రబాబు చండ్ర నిప్పులు

సంగారెడ్డి, నవంబర్ 26 : "ఆయన కొడుకు, కూతురు, అల్లుడికి ఉద్యోగాలు ఉంటే చాలు. మరెవరి ఉపాధి, ఉద్యోగంతో కేసీఆర్‌కు పని లేదు'' అంటూ గులాబీ అధిపతిపై టీడీపీ అధ్యక్షుడు నిప్పులు చెరిగారు. సూర్యాపేట వేదికగా కేసీఆర్ తనపై చేసిన ప్రతి విమర్శనూ మెదక్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు సమర్థంగా తిప్పికొట్టారు. మోకాళ్లపై నడిచినా చంద్రబాబును ఎవరూ నమ్మరన్న కేసీఆర్ వ్యాఖ్యలను.. "నీ మాటల గారడీని నమ్ముతారా'' అంటూ ధీటుగా జవాబిచ్చారు.

తన హయాంలో రిటైర్మెంట్లే గానీ రిక్రూట్‌మెంట్లు లేవన్న విమర్శపై.."కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో చెప్పా''లంటూ సూటి ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో సోమవారం నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలా లలో చంద్రబాబు పాదయాత్ర సాగించారు. నారాయణఖేడ్ నుంచి పెద్దశంకరంపేట వరకు 15.1 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈ సందర్భంగా జరిగిన పలు సభల్లో టీఆర్ఎస్ మాటల పార్టీ అని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు, ఆయన కొడుకు, కూతురుకు ఉద్యోగాలు ఉంటే చాలని, మీకు రాకపోయినా ఆయనకేమీ పట్టదన్నారు.

ఉద్యమంలో ఇప్పటికే పదేళ్లు నష్టపోయారని, ఒక తరం పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. "ఇంకో పదేళ్లు ఇలాగే కొనసాగితే జీవితాలపైనే ఆశ పోతుంది'' అని గుమిగూడిన యువకులను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మోకాళ్ల మీద నడిచినా ప్రజలు నమ్మరన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన మాటల గారడీని ప్రజలు నమ్మాలా అని ప్రశ్నించారు. నీతి, నిజాయతీకి కట్టుబడి ఉన్నానని, అందుకే ప్రజలసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు.

ఆర్నెల్లు కుంభకర్ణునిలా ఫాంహౌస్‌లో పడుకునే కేసీఆర్.. ఆ తర్వాత ఒక్క రోజు లేచి మాయమాటలు, రెచ్చగొట్టే మాటలతో ప్రజల బతుకులను ఆగం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీలు అవినీతి పార్టీలని చంద్రబాబు విమర్శించారు. సామాజిక న్యాయమన్న చిరంజీవి.. కేంద్రంలో ఒక్క పదవి రాగానే తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారని మండిపడ్డారు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన పార్టీ టీడీపీయేనన్నారు.

కాగా, నారాయణఖేడ్ మండలం హన్మంతరావు పేటలో చంద్రబాబు చేనేత కార్మికులను కలుసుకొని సమస్యలపై ఆరాతీశారు. "వెయ్యి కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా బడ్జెట్ ప్రవేశపెడతాం. నూలు, రంగును సబ్సిడీ ధరపై ఇప్పిస్తాం. ఎటువంటి ష్యూరిటీ లేకుండా రూ.50 వేల వరకు రుణాలు ఇప్పిస్తాం. ప్రతి కార్మికుడికి ఇల్లు, షెడ్ నిర్మించి ఇస్తాం. బీమా సౌకర్యం కల్పిస్తాం. జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం'' అని వారికి హామీ ఇచ్చారు.

ధర్మానపై ప్రాసిక్యూషన్‌కు ఆదేశించండి.. గవర్నర్‌కు వినతి

రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని టీడీపీ అధినేత చంద్రబాబు..గవర్నర్ నరసింహన్‌ను కోరారు. ప్రాసి క్యూషన్ అవసరం లేదన్న కేబినెట్ తీర్మానాన్ని తిర స్కరించాలని విజ్ఞప్తి చేశారు. సిగ్గులేకుండా మంత్రి ధర్మానకు సీఎం కిరణ్ అండగా నిలవడం శోచనీయమన్నారు.

ఆయనతీరు చూస్తే ఎంత దోచుకున్నా ఫరవాలేదన్నట్టు ఉన్నదని దుయ్యబట్టారు. అవినీతిపరులను రక్షించవద్దని, ఇలాంటివారిపై కఠినచర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. దోచుకున్న డబ్బును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులకో రూలు దొంగలకోరూలు ఉండరాదని, చట్టం అందరికీ ఒకటేలాగా ఉండాలని గుర్తుచేశారు.