October 11, 2012

పాదయాత్రలో టిడిపి అధినేత చంద్రబాబు -ప్రజాశక్తి

 ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర గురువారం పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు కణేకల్లు మండలం అనకనహల్లులో పాదయాత్ర ప్రారంభమైంది. సల్లాపురం, ఎన్‌.హనుమాపురం, నింబగళ్ల్లు గ్రామాల మీదుగా సాగింది. ఆయా ప్రాంతాల్లోని రైతుల, రజకుల, వ్యవసాయకూలీలు, నిరుద్యోగులు, వృద్ధులు, మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రజాసంక్షేమం గురించి కాంగ్రెస్‌ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాధనాన్ని దొంగల్లా దోచుకుని పండుగలు చేసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జిల్లాలో శ్రీరామిరెడ్డి తాగునీటి కోసం 650 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా ఏ ఒక్క గ్రామానికి కూడా తాగునీటిరు సక్రమంగా సరఫరా చేయడం లేదన్నారు. టిడిపి అధికారంలో 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆదాయం ఆరు రెట్లు పెరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందన్నారు. కరెంటు బిల్లులు, డీజిల్‌, పెట్రో ధరలు పెంచి పేదలపై మరింత భారం మోపిందన్నారు. సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని మైనింగ్‌ ముడిసరుకులు ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టడం లేదన్నారు. స్వార్థపరులకు అప్పనంగా అప్పజెప్పి కోట్ల రూపాయలను కొల్లగొట్టిందన్నారు. అవినీతి పరుల వల్ల రాష్ట్ర పరువు పోతోందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే బిసిలకు పెద్దపీట వేస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. ప్రకృతి సంపదను దోచుకున్న గాలిజనర్థాన్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ, వైఎస్‌ఆర్‌సిపి పార్టీలు రెండూ దొంగలేనని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీలో కలిసేందుకు వైఎస్‌ఆర్‌సిపి చర్యలు మొదలు పెట్టిందని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఏర్పడిన ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమయ్యిందని గుర్తు చేశారు. సామాజిక న్యాయం అంటే కొందరి కోసం కాదని ఆయన చెప్పారు.అక్రమాస్తుల కేసులో వైఎస్‌ఆర్‌సిపి నాయకులంతా జైలుకు వెళ్లారని, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని సుప్రీంకోర్టు అడిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయన్నారు. భవిష్యత్తులో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్లలో కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. మాదిగలకు అన్యాయం జరిగిందని, అందుకే ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్నానని తెలిపారు. ముస్లిం జనాభాకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు లేరని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు పార్థసారధి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి దీపక్‌రెడ్డి, ఎమ్మెల్సీ మెట్టుగోవిందురెడ్డి, పరిటాల సునీత, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
హైస్కూలుకు రూ.రెండు లక్షల ఎమ్మెల్సీ నిధులు...
చంద్రబాబు చేపట్టిన పాదయాత్రలో సందర్భంగా హనకనహల్లు హైస్కూలుకు 2.5 లక్షల రూపాయలు నిధులను ఎమ్మెల్సీ నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ మెట్టుగోవిందురెడ్డికి సూచించారు. ఈ నిధులను మరుగుదొడ్లు, తాగునీటి, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని చెప్పారు.
No comments :

No comments :