October 1, 2012

వస్తున్నా... మీకోసం ...వార్త ప్రజాశక్తిలో





వస్తున్నా... మీకోసం

  • బాబు యాత్రకు నామకరణం
  • 30న సీమాంధ్ర, 5న తెలంగాణలో జిల్లా కమిటీల ఎన్నికలు
  • 20 నుంచి పల్లె పల్లెకూ తెలుగుదేశం - ఎర్రన్నాయుడు వెల్లడి
టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు చేపట్టనున్న పాదయాత్రకు నామకరణం ఖరారైంది. 'వస్తున్నా... మీకోసం' అనే పేరు ఖరారు చేసినట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తేదీలనూ ప్రకటించారు. సోమవారం టిడిపి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు చేపట్టనున్న పాదయాత్రకు 'వస్తున్నా... మీకోసం' అనే పేరును ఖరారు చేశామని, బాబు ఈ యాత్రను అక్టోబర్‌ 2న ప్రారంభించి 117 రోజులపాటు పాదయాత్ర చేసి 2013 జనవరి 26న ముగించనున్నారని తెలిపారు. పార్టీ సంస్థాగత ఎన్నికలను రెండు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సీమాంధ్ర జిల్లాల్లో సెప్టెంబర్‌ 30న, తెలంగాణ జిల్లాల్లో అక్టోబర్‌ 5న జిల్లా కార్యవర్గ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 30 వరకు పల్లె పల్లెకూ తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వివిధ వర్గాల కోసం చేసిన మంచి పనులను చెబుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఐఎంజి కేసులో చంద్రబాబును ఇరికించాలని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చాలాసార్లు ప్రయత్నించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఎంజి కేసును కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయన్నారు. తద్వారా కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ను తమ పార్టీలో విలీనం చేసుకోవాలనే ఆలోచన చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ కలిసిపోవడం రెండు ప్రకటనలూ ఒకేసారి రావచ్చన్నారు. కోర్టుల్లో ఎప్పుడూ వాదించని కొత్త న్యాయవాదులను నియమించి జగన్‌ కేసును నీరుగార్చే కుట్రకు కాంగ్రెస్‌ పూనుకుంటోందన్నారు. ఎన్ని పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా టిడిపి దేనికీ బెదరదని, తొణకదని పేర్కొన్నారు. తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
No comments :

No comments :