October 27, 2012

మామయ్య త్వరగా కోలుకుని తాను అనుకున్న కార్యాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు....జూనియర్ ఎన్టీఆర్ 27.10.2012

 file photo
అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ శనివారం పరామర్శించారు. ఆయన షూటింగ్‌ను వాయిదా వేసుకుని చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న గద్వాల సమీపంలోని శెట్టి ఆత్మకూరుకు వచ్చారు. నిర్మాత బండ్ల గణేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ వెంట ఉన్నారు.
నిన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిందేనని, అది తెలిసి మామయ్యను పలకరించడానికి వచ్చానని జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మామయ్య త్వరగా కోలుకుని తాను అనుకున్న కార్యాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు కోలుకుని పాదయాత్ర కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు పార్టీకి, రాష్ట్రానికి పునర్వైభవం తేవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
తన షూటింగులను బట్టి, తేదీలను బట్టి చంద్రబాబుతో పాదయాత్రలో పాల్గొనే విషయాన్ని నిర్ణయించుకుంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడిగా భావించే కొడాలి నాని పార్టీ వీడిపోయిన తర్వాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కావడం ఇదే తొలిసారు. చంద్రబాబుతో ఆయన చాలా కాలంగా విభేదిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
సభా వేదిక కూలిపోయి చంద్రబాబు గాయపడ్డారనే తెలిసిన వెంటనే ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ ఇక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు వెంట వారిద్దరు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఉన్నారు. చంద్రబాబును పరామర్శించేందుకు ఆయన సోదరుడి కుమారుడు, హీరో నారా రోహిత్ కూడా రావచ్చునని చెబుతున్నారు.
No comments :

No comments :