September 15, 2013

'చిరంజీవి, కావూరి, లగడపాటి తదితర సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులందరూ చేతకాని దద్దమ్మలు.

'చిరంజీవి, కావూరి, లగడపాటి తదితర సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులందరూ చేతకాని దద్దమ్మలు. ఢిల్లీలో, హైదరాబాద్‌లో ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడుతున్నారు. ఉద్యమం ఎగసిపడుతున్నా సోనియా భజనే చేస్తున్నారు.' అని కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు, మైలవరం శాసన సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. 47 రోజులుగా సీమాంధ్రలో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్నారన్నారు.


సోనియాను తిడితే ఉద్యమకారుల గొంతులు పిసుకుతాం, నాలుకలు కోస్తామని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారన్నారు. తెలుగువాడికి భరోసా కల్పించటానికి టీడీపీ అధినేత చంద్రబాబు యాత్ర చేపడితే, ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా ప్రజల వద్దకు వెళ్లారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల 10 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు తమిళనాడుకు, కర్ణాటకకు తరలిపోయాయన్నారు. అలాగే 70 వేల కోట్ల రియల్ ఎస్టేట్ కూడా ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లిపోయిందన్నారు. గాంధీ టోపీలు పెట్టుకొని నాలుకలు కోస్తాం, గొంతు పిసుకుతామని పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు