July 31, 2013

కొత్త రాజధానిపై కేంద్రం ప్రకటన చేయలేదు : చంద్రబాబు

ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వివరణ ఇచ్చారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ హయాంలోనే హైదరాబాద్‌ను చాలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కొత్త రాజధాని ఏర్పాటుపై కేంద్రం నిర్థిష్టమైన ప్రకటన చేయలేదని ఆయన అన్నారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రేగకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
చారిత్రక కారణాల వల్ల కేంద్రానికి కొన్ని డిమాండ్లు చేస్తున్నామన్నారు. కొత్త రాజధాని అభివృద్ధి చేయడానికి నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, కొత్త రాజధానిని హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేంద్ర నిధులతో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సూచించారు. సాగునీటి సమస్య ఎలా పరిష్కారిస్తారో చెప్పాలన్నారు. ఉద్యోగాలు, విద్యుత్, వనరుల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
కొత్త రాజధాని ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అనివార్య కారణాల వల్ల రాష్ట్రం విడిపోయినా ప్రజల మధ్య సమైక్యత ఉండాలని బాబు కోరారు. ప్రాణహిత ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాలు బిల్లులో పొందుపర్చాలి. సీమాంధ్ర ప్రజలు సంయమనం పాటించాలన్నారు. ఆత్మహత్యలు సమస్య పరిష్కారం కాదని హితవు చేశారు.
అందరికీ న్యాయం జరిగేలా చొరవ తీసుకుంటామని...కేంద్రం, అన్ని పార్టీలతో మాట్లాడతామని చంద్రబాబు హామీ ఇచారు. రాజకీయాల గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేనని బాబు చెప్పారు. తెలంగాణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో నిన్న దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. కాంగ్రెస్ మాధిరిగా రాజకీయ లబ్దికోసం ప్రయత్నించడం లేదని చంద్రబాబు తెలియజేశారు.