June 18, 2013

మరో ముగ్గురు జైలుకు వెళ్తారు : పయ్యావుల

త్వరలోనే మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్తారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. అసెంబ్లీలో కళంకిత మంత్రులపై చర్చ సందర్భంగా కేశవ్‌ మాట్లాడారు. మంత్రులపై విచారణ జరపాలని హైకోర్టుకు వెళ్లింది తొలుత టీడీపీయేనని ఆయన పేర్కొన్నారు. దొంగలబండికి సీఎం సారథిగా ఉన్నారని విమర్శించారు. దీనిపై ధర్మాన స్పందించారు. మాపై పిటీషనర్‌ ఏం చేశారో తెలియకుండా టీడీపీ మాట్లాడుతోందన్నారు. టీడీపీ ఆరోపణలపై చర్చించడానికి తాము సిద్ధంగాఉన్నామని ప్రకటించారు. చంద్రబాబు సభలో ఉంటే వారి పార్టీ చేస్తున్న విమర్శలను సమర్థించే వారు కాదని వ్యాఖ్యానించారు. ధర్మాన వ్యాఖ్యలను టీడీపీ సభ్యులు ఖండించారు. కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు.