May 26, 2013

మహానాడు ప్రారంభించిన చంద్రబాబు


హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరంతో పాటు ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ఆరంభించారు. హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగు విజయంలో సోమ, మంగళవారాలు కొనసాగనున్న మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సీనియర్ నేతలు, పార్టీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సోమవారం నాటి మహానాడులో రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యే అంశాలతో పాటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
మరోవైపు తెలుగు విజయం ప్రాంగణమంతా పసుపుమయంగా మారిపోయింది. పసుపురంగు జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. సభా వేదికపై ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ఫొటోలను ఉంచారు. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు నాయడుల చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. పత్రికలు, టీవీల ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్, భోజనశాల ఏర్పాటు చేశారు.