May 31, 2013

వన్ ప్లస్ వన్ ఆఫర్‌తో నేతల ఇళ్ల చుట్టు కెసిఆర్: పెద్దిరెడ్డి


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వన్ ప్లస్ వన్ ఆఫర్‌తో నేతల ఇళ్ల చుట్టు తిరుగుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి శుక్రవారం విమర్శించారు. తెలంగాణపై తీర్మానం తెచ్చే శక్తి కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. కెసిఆర్ ఉద్యమాన్ని వదిలి పెట్టి నేతల ఇళ్ల చుట్టు తిరుగుతూ.. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా టిక్కెట్ల పేరుతో గాలం వేస్తున్నారన్నరు.

ఒకప్పుడు తెలంగాణకు చెన్నారెడ్డి, వెంకట స్వామిలు మోసం చేస్తే, ఇప్పుడు కెసిఆర్, కాకా తనయులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస నేత కెసిఆర్ ప్రాంతీయ వాదానికంటే వలసలకే ప్రాధాన్యం ఇస్తున్నార్ననారు. ఉద్యమానికి ప్రజలు కావాలి, టిక్కెట్లకు ఇతర పార్టీల నేతలు కావాలా... ఇదేనా ఉద్యమ స్ఫూర్తి అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ నిజంగా తెలంగాణను కోరుకుంటే టిడిపితో కలిసి రావాలన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తే ఊరూరా విగ్రహాలు పెడతామని, జేబులో ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతామని పెద్దిరెడ్డి అన్నారు. తెరాసలోకి వెళ్లేవారంతా పదవుల కోసమే వెళ్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే జెఏసి కింద స్వతంత్ర ఉద్యమానికి కెసిఆర్ సిద్ధం కావాలన్నారు.