November 8, 2012

కాంగ్రెస్ నేతలు అడవి పందులు , తిన్నంత తిని మిగతాది నాశనం చేసేవారు



కాంగ్రెస్ నేతలు అడవి పందులు
తిన్నంత తిని మిగతాది నాశనం చేసేవారు
దోచుకున్నదంతా విదేశాలకు తరలింపు
ఆ పార్టీని చంపేస్తేనే అవినీతి అంతం
రాష్ట్రానికి సీఎం ఉన్నాడా అని చంద్రబాబు ప్రశ్న
తెలంగాణపై కాంగ్రెస్ దోబూచులాడుతోంది
టీడీపీ సభలో బీజేపీ, టీఆర్ఎస్ నిరసనలు
మహబూబ్‌నగర్‌లో ముగింపుకొచ్చిన పాదయాత్ర
రాష్ట్రంలోని సంపదను కాంగ్రెస్ నాయకులు అడవి పందుల్లా తిన్నంత తిని, మిగతాది ధ్వంసం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దోచుకున్న సొమ్మునంతా విదేశాలలో దాచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా ఆనాడే వైఎస్‌ను హెచ్చరించి ఉంటే, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీని చంపేస్తేనే అవినీతి అంతమవుతుందని తీవ్ర స్వరంతో అన్నారు. వస్తున్నా... మీ కోసం పాదయాత్రను కోయిల్‌కొండ మండలంలో బుధవారం కొనసాగించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ విధానాలపై నిప్పులు చెరుగుతూ ఆయన పాదయాత్ర సాగించారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. సకల జనుల సమ్మె సందర్భంగా ఉద్యోగులపై పెట్టిన కేసులను సత్వరమే ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. శాలెపల్లి, పల్గుతండా, కోయిల్‌కొండలో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న ఓయూ విద్యార్థి సంతోష్ మృతికి సంతాపం ప్రకటించారు.

సంతోష్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. యువత భావోద్వోగాలకు లోనుకావద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి అసలు సీఎం ఉన్నాడా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఆయన ఏ పనీ చేయడని విమర్శించారు. రైతులకు రుణ మాఫీపై, పేదలకు సిలిండర్ల కోటా పెంపుపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కిరికిరి సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిలో సోనియాకు వాటా ఉన్నందునే వైఎస్‌ను కట్టడి చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కుటుంబం ఖరీదైన ప్యాలెస్‌లు, టీవీ చానళ్ళు, పేపర్లు పెట్టడం ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే అంశమని చెప్పారు. ఉద్యోగులకు వెంటనే పీఆర్‌సీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

తాను పేదల కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నాను తప్ప, ముఖ్యమంత్రి పదవి కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీని పరిరక్షిస్తామని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, రిటైర్డు ఉద్యోగులకు ఇంటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, పాదయాత్రకు జిల్లా న్యాయవాదుల సంఘం సంఘీభావం తెలిపింది. బ్రిటన్‌కు చెందిన ఎన్ఆర్ఐలు, జిల్లా ముదిరాజ్ సంఘం కూడా చంద్రబాబు పాదయాత్రకు మద్దతు తెలిపారు. అంతకుముందు.. అంకిళ్లలో బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. ఇక్కడి కళ్యాణనగర్ తండాలో స్థానికులు చంద్రబాబును పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. కోయిల్‌కొండ సమీపంలో మైనార్టీలు చంద్రబాబును సత్కరించారు. నాయీబ్రహ్మణుల దుకాణంలో బాబు కొద్దిసేపు గడిపారు.

చివరి అంకానికి..
గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ముగియనుంది. ఉదయం శేర్‌వెంకటాపూర్ నుండి బయలుదేరి సూరారం, కొత్లాబాద్ ద్వారా మధ్యాహ్నానికి రంగారెడ్డి జిల్లా పగిడియాల చేరుకుంటారు. కాగా బుధవారం సుమారు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

మీ కోసం యాత్ర చేయాలా..వద్దా?
కోయిల్‌కొండ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో, స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు అదుపు చేశారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో శేఖర్ అనే ఓ మీడియా కెమెరామన్ తలకు గాయమైంది. మరో ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి.

కాగా, ఈ దాడిని చంద్రబాబు ఖండించారు. టీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలు, రైతు సమస్యలను పట్టించుకోరని ఆరోపించారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కానని పదే పదే స్పష్టం చేసినా నిరసన వ్యక్తం చేయడం విచారకరమన్నారు. జిల్లాలో సీఎం మూడు రోజులు పర్యటిస్తే ఒక్కనాడూ నిరసన తెలియజేయలేదని గుర్తుచేశారు. మీ కోసం పాదయాత్ర చేయాలా? వద్దా? అని బాబు కోరగా, సభకు వచ్చిన వారంతా యాత్ర కొనసాగించాలని చేతులెత్తి హర్షామోదం తెలిపారు.

No comments :

No comments :