November 25, 2012

నమ్మితేనే నాతో రండి: చంద్రబాబు

నమ్మితేనే నాతో రండి: చంద్రబాబు
సీటుపైనే సీఎం ధ్యాస
అధికారమిస్తే మీ ఇంట పెద్ద కొడుకునవుతా..
ఎన్ని కిరికిరిలు పెట్టినా రైతు రుణమాఫీ చేస్తా
చంద్రబాబు వెల్లడి
టీఆర్ఎస్‌తో పోకుంటే గెలిచేవాళ్లం
రాష్ట్రాన్ని దోచుకున్న తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్
కిరణ్‌ది రాక్షస ప్రభుత్వం
రైతుల కోసం కనీసం సమీక్షల్లేవు
మెదక్ జిల్లా పాదయాత్రలో ధ్వజం

సంగారెడ్డి, నవంబర్ 25 (ఆంధ్రజ్యోతి) : టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోకపోతే గత ఎన్నికల్లో తామే గెలిచేవారమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను చెప్పిన విషయాలపై ఆలోచించి,వాస్తవమని నమ్మితే తనకు సహకరించాలని ప్రజలను కోరారు. "తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంటికి పెద్దకొడుకులా మీ జీవితాల్లో ఆనందం నింపుతా''నని చంద్రబాబు హామీ ఇచ్చారు. మెదక్ జిల్లాలో ఎనిమిదో రోజైన ఆదివారం ఆయన మనూర్ నుంచి నారాయణఖేడ్ వరకు 9 కిలోమీటర్లు నడిచారు.

శనివారం రాత్రి మనూర్‌లో బస చేసిన చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం వరకు కొంత విరామం తీసుకున్నారు. ప్రతి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు సమయమిస్తున్నారు. అందులో భాగంగా సతీమణి భువనేశ్వరితో మధ్యాహ్నం వరకు గడిపారు. అనంతరం ఎంపీ దేవేందర్‌గౌడ్‌తో మాట్లాడి 2.30 గంటల సమయంలో నడక ప్రారంభించారు. పాదయా।త మొదట్లోనే వికలాంగులు ఎదురై సమస్యలు చెప్పుకున్నారు. అక్కడే ఉన్న వృద్దురాలు రత్నమ్మను పలకరించగా, పింఛను రావడం లేదని వాపోయింది.

మనూర్ తాండాకు వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్లు కట్టుకున్నా బిల్లులు చెల్లించడం లేదని వారు వాపోయారు. టీఎన్‌టీయుసి ఆధ్వర్యంలో జిన్నారం మండలం నుంచి సుమారు వంద మంది కార్మికులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. జగన్నాథపూర్ సమీపంలో రాణాపూర్‌కు చెందిన రైతు సంగారెడ్డిని కలవగా, పంట నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదర్శరైతుల ద్వారా కాంగ్రెస్ నాయకులే ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులను స్వాహా చేస్తున్నారని సంగారెడ్డి ఫిర్యాదు చేయగా, న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

ఈ క్రమంలో పిప్రీ గ్రామ శివారులో పోమ్యానాయక్‌కు చెందిన ఉల్లిగడ్డ పంటను చూశారు. ఈ సమయంలో కార్యకర్తలు, మీడియా కొంత హడావుడిచేయడంతో పంట కొంత దెబ్బతింది. దీనికిగాను పోమ్యానాయన్‌కు చంద్రబాబు రెండు వేల రూపాయలు పరిహారంగా ఇచ్చారు. ఈ సందర్భంగా పిప్రి, నారాయణఖేడ్‌లలో జరిగిన సభలలో చంద్రబాబు ప్రసంగించారు. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

ఆయన పార్టీతో పొత్తు వల్ల నష్టపోయామని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. సినీనటుడు చిరంజీవి.. పార్టీ పెట్టక పోయినా అధికారంలోకి వచ్చే వారమన్నారు. తెలంగాణకు ఎప్పుడూ తమ పార్టీ వ్యతిరేకం కాదని, అలాగెప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. తెలంగాణ గురించి మహానాడులో తమ వైఖరి చెప్పామని, అఖిలపక్షం పెట్టాలని కేంద్రానికి లేఖ రాశామని గుర్తుచేశారు.

దీనిపై కేంద్రం నాటకాలాడుతున్నదని విమర్శించారు. అసలు కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే బయటకు పోయేవారా? పార్టీ పెట్టేవారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సీటును కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర రాక, కరెంట్ సరఫరా కాక, విత్తనాలు, ఎరువులు దొరకక రైతులు అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం కనీస స్పందన కనబరచడం లేదన్నారు.

వ్యవసాయ ధరలపై కనీసం సమీక్షలు కూడా నిర్వహించడం లేదని విమర్శించారు. నిత్యావసర సరకుల ధరలు పెరిగి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. 30 రూపాయలకు కిలో ఉన్న మంచినూనే 110 రూపాయలైందని, ఆ స్థాయిలో ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదన్నారు. "ఇది రాక్షస ప్రభుత్వం. అవినీతి, అసమర్థ, పేదల వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక్క రోజు కూడా సాగడానికి వీల్లేదు'' అని మండిపడ్డారు.

రైతులకు రుణ మాఫీ చేస్తానంటే సీఎం కిరణ్ కిరికిరి పెడుతున్నారని విమర్శించారు. రైతులకు ఎప్పుడూ కాంగ్రెస్ వ్యతిరేకమేనన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు దొంగల్లా దోచుకుని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లుగా విడిపోయారని చెప్పారు. ఆ నాయకులు ఇలా రెండు పార్టీలుగా ఎందుకు విడిపోయారో చెప్పాలన్నారు. అక్రమంగా దోచుకున్న డబ్బులను కాపాడుకోవడానికే పిల్ల కాంగ్రెస్ ఏర్పాటయిందని పేర్కొన్నారు. బీసీలకు సామాజిక న్యాయం కల్పించేందుకే బీసీ డిక్లరేషన్ ప్రకటించామన్నారు.