May 20, 2014

ఎన్డీయే ప్రభుత్వంలో చేరుతున్నాం : బాబు

న్యూఢిల్లీ, మే 20 : దేశంలో కొత్తశకం ప్రారంభమైందని, దేశానికి ఈరోజు శుభదినమని, నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం దేశానికి శుభశూచకమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి ఢిల్లీలో ఏపీ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుపరిపాలన కోసం దేశం ఎదురుచూస్తోందని అన్నారు. భారీ మెజార్టీతో మోదీ గెలుస్తారని ముందే చెప్పానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. నరేంద్రమోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం తనకు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
యూపీఏ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. యూపీయే పదేళ్ల పరిపాలనలో అవినీతి పెరిగిందని, యూపీఏపై కోపంతో ప్రజలు ఎన్డీయేకు పట్టం కట్టారని ఆయన అన్నారు. రెండు సార్లు కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నామని ఆయన అన్నారు. ఎన్డీయేలో చేరుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
సామాజిక తెలంగాణ టీడీపీ లక్ష్యమని, అందుకు సహకరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీయే హయంలో రెండు ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, హైదరాబాద్‌లోని తెలుగువారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరి సహకారం కావాలని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని నరేంద్రమోదీ ముందే చెప్పారని చంద్రబాబు తెలిపారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఆం«ధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని, అన్నీ పట్టణాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలకు అండగా ఉంటామని నేను, మోదీ హామీ ఇచ్చామని, ఈ హామీల అమలుకు కృషి చేస్తానని ఆయన వాగ్ధానం చేశారు. విభజనతో రాష్ట్రాన్ని పెనం నుంచి పొయ్యిలో పడేశారని కాంగ్రెస్‌నను బాబు దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనలో హేతుబద్దత లేదని ప్రశ్నిస్తే... తనవి రెండు కళ్ల సిద్ధాంతమని కొందరు ఎగతాళి చేశారని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడనేది నిర్ణయిం
చకుండా ఎలా విభజన చేస్తారని చంద్రబాబు కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అవినీతి రహిత దేశం కోసం కృషి చేస్తామని, వ్యక్తులను కాదు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రమాణస్వీకారం చేస్తానని, ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తానని ఆయన అన్నారు. పరిపాలన ఏపీ నుంచే మొదలు పెడతానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.