October 10, 2012

ఎనిమిదో రోజు పాదయాత్ర కళ్యణదుర్గం 09.10.2012

8th Day Vastunna meekosam padayatra at Kalyanadurgam

మళ్లీ ప్రజాస్వామ్యాన్ని తెద్దాం
నా హయాంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు
కాంగ్రెస్ కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్
అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగం
నిరుద్యోగులకు రూ.1000 భృతి

  "మీ ప్రోత్సాహంతోనే నేను నడుస్తున్నాను. మీరే నన్ను నడిపిస్తున్నారు. రోజుకు 12 గంటలు నడిచినా కాళ్లకు నొప్పులు లేవు. మీ కష్టాలే కనిపిస్తున్నాయి. మీ కష్టాలు తీర్చి మీ కళ్లల్లో ఆనందం చూడాలని ఉంది. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకు రావడానికి మీరంతా సహకరించాలి. మీరు సహకరిస్తే ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మిద్దాం'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన పాదయాత్ర ఎనిమిదో రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నారాయణపురం క్రాస్ నుంచి ప్రారంభమైంది.

మంగళవారం 18.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించి బెళుగుప్ప మండలం విరూపాపల్లి క్రాస్ వద్ద బస చేశారు. మంత్రి రఘువీరా ఇలాకా కళ్యాణదుర్గంలో ప్రజలు బాబుకు నీరాజనం పలికారు. ఇక్కడే చంద్రబాబు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ మారిందన్నారు. "టీడీపీ హయాంలో విద్యా రంగంలో ప్రవేశపెట్టిన వినూత్న పద్ధతుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది యువతీ యువకులు ఉద్యోగాలు సంపాదించారు.

నా హయాంలో రాష్ట్రానికి నాలెడ్జి హబ్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చా. కానీ, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని అవినీతి కుంభకోణాల్లోకి నెట్టింది. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు. వ్యవసాయ మోటార్లు ఆడవు. వీధిలైట్లు వెలగవు. తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. రాని కరెంటుకు 15 రెట్లు చార్జీలు పెంచి వసూలు చేస్తున్నారు. ఇంటి పన్ను పెంచేశారు. అన్ని ధరలూ పెంచేసి.. దోపిడీ చేసేసి కనీసం తాగునీరు కూడా సక్రమంగా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత ఎక్కడ ఉంది!?'' అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

యువత, విద్యార్థి లోకం అవినీతిపరుల గుండెల్లో నిద్రపోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే చదువుకున్న ప్రతి ఒక్కరికీఉద్యోగంతోపాటు నెలకు రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. మిగులు బడ్జెట్‌తోపాటు మిగులు విద్యుత్ కూడా అందించిన ఘనత టీడీపీదేనన్నారు. కాంగ్రెస్ పాలన దాదాపు గాడి తప్పిందని, దానిని గాడిలో పెట్టే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని, ఇందుకు ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. 'మీకు రఘువీరా ఏమైనా న్యాయం చేశారా?' అని కళ్యాణదుర్గం ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు.

వారి నుంచి 'లేదు.. లేదు..' అని జవాబు వచ్చింది. దీంతో, "ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు అభివృద్ధి చెందారు. రఘువీరా రెడ్డి బ్రహ్మాండమైన ప్యాలెస్ నిర్మించారు. ప్రజలకు ఏమాత్రం మౌలిక సదుపాయాలు కల్పించలేదు' అని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడ్డ మంత్రుల్లో ఇప్పటికే కొందరు చంచల్‌గూడ జైల్లో ఉన్నారని, మరికొందరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, కేబినెట్ సమావేశాలు అక్కడే పెట్టుకునే పరిస్థితి ఉంద'ని ఎద్దేవా చేశారు. వాల్మీకులు, వడ్డెరలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామని, వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు.
No comments :

No comments :